న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి మాస్ లేఆఫ్స్కు తెగబడింది. తాజా లేఆఫ్స్లో భాగంగా వేయి మంది ఉద్యోగులపై వేటు వేసిందని ఓ రిపోర్ట్ వెల్లడించింది. తమను ఉద్యోగాల నుంచి తొలగించాని పలువురు ఉద్యోగులు ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా వేదికల ద్వారా వాపోయారు. తాను మైక్రోసాఫ్ట్లో జాబ్ కోల్పోయానని సీనియర్ ఉద్యోగిని, ప్రోడక్ట్ సూపర్వైజర్ కేసీ లెమ్సన్ ట్వీట్ చేశారు.
లెమ్సన్ సహా మైక్రోసాఫ్ట్లో పలువురు సీనియర్ ఉద్యోగులు లేఆఫ్స్కు బలయ్యారు. తాజా లేఆఫ్స్పై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి స్పందిస్తూ ఇతర కంపెనీల తరహాలోనే తాము సంస్ధ ప్రాధామ్యాలకు అనుగుణంగా సంస్ధాగత మార్పులు చేపడుతున్నామని చెప్పారు. ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలకు ఈ ఏడాది జులైలోనే మైక్రోసాఫ్ట్ పదును పెట్టింది. ప్రాధామ్యాల పున:సమీక్ష మొదలైందని, ఇది ఆచరణలో సంక్లిష్ట ప్రక్రయని మైక్రోసాఫ్ట్ ఇంజనీరింగ్ టీంకు చెందిన జాక్ క్రామ ర్ ఉద్యోగులపై వేటును ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
మైక్రోసాఫ్ట్తో పాటు పలు టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ బాట పట్టాయి. మార్క్ జుకర్బర్గ్ సారధ్యంలోని మెటా పెద్దసంఖ్యలో ఉద్యోగులను సాగనంపేందుకు సిద్ధమైంది. మెటా దాదాపు 12,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా చర్చా వేదికలపై మెటా ఉద్యోగి ఈ విషయం వెల్లడించారు.