Heavy Rains | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 23, 24తేదీల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకొని ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని వెల్లడించింది. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొన్నది. దీంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది.
ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు నెలకొనడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించారు.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.