న్యూఢిల్లీ : చాట్జీపీటీ (ChatGPT), బింగ్ ఏఐ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వేదికలైన చాట్జీపీటీ, బింగ్ ఏఐ వంటి టూల్స్ విశేష ఆదరణ పొందుతున్నాయి. ఈ ఏఐ టూల్స్ రాకతో రాబోయే రోజుల్లో ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోది. బజ్ఫీడ్ మీడియా వంటి కొన్ని గ్లోబల్ కంపెనీలు కొన్ని ఉద్యోగాలను చాట్జీపీటీతో రీప్లేస్ చేస్తామని ప్రకటించడంతో సర్వత్రా ఏఐ టూల్స్తో ఉద్యోగాలు ఊడతాయనే భయాలు వెంటాడుతున్నాయి.
చాట్జీపీటీ వంటి ప్లాట్ఫాంలతో ఉత్పాదకత మెరుగవుతుందే కానీ బిజినెస్ మోడల్స్ మారిపోవని ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా ఉండదని దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ స్పష్టం చేసింది. ఏఐ సహోద్యోగిలా ఉంటుందే తప్ప కొలువులు కోల్పోయేలా వ్యవరించదని పేర్కొంది. ఉద్యోగాలను చాట్జీపీటీ రీప్లేస్ చేయబోదని, అయితే వాటి నిర్వచనాలు మారిపోతాయని టీసీఎస్ చీఫ్ మానవ వనరుల అధికారి (సీహెచ్ఆర్ఓ) మిలింద్ లక్కాడ్ తెలిపారు.
ఏఐ భవిష్యత్ కోసం మెరుగైన వేదికగా ఉంటుందని, దీని ద్వారా ఉద్యోగాల రీప్లేస్మెంట్ ఉండదని, కొలాబరేషన్ ఉంటుందని ఆయన అంచనా వేశారు. టీసీఎస్ కొన్ని విభాగాల్లో ఏఐ టూల్స్ ఇన్పుట్స్ను వాడుతోందని ఓ ప్రశ్నకు బదులిస్తూ పేర్కొన్నారు. ఏఐ టూల్స్ వాడకంపై వాటి ప్రభావం, పర్యవసానాలపై మరో రెండేళ్లలో పూర్తి స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు. చాట్జీపీటీ, బింగ్ వంటి ఏఐ టూల్స్ మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్యోగాల్లో ఏఐ వర్క్ అధిక సంతృప్తిని తీసుకువస్తుందని సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఈ టెక్నాలజీల రాకతో మున్ముందు వేతనాలు కూడా పెరుగుతాయని అంచనా వేశారు.
Read More :