ముంబై: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షియోమీ రెడ్మీ నోట్ సిరీస్లో విడుదల చేస్తున్న స్మార్ట్ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. కంపెనీ ప్రతి ఏడాది విడుదల చేసే నోట్ సిరీస్ కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా రెడ్మీ సిరీస్లోని ఓ ఫోన్ను సరికొత్త ఫీచర్లతో మరోసారి ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
రెడ్మీ నోట్ 8 ఫోన్ను మొదటిసారిగా 2019లో కంపెనీ లాంచ్ చేసింది. ఇప్పుడు అదే మోడల్ను సరికొత్త ఫీచర్లతో రెడ్మీ నోట్ 8(2021) పేరుతో భారత్లో ఆవిష్కరించబోతోంది. కొత్త వేరియంట్లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్, 4000mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 48 మెగా పిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.3 అంగుళాల ఫుల్హెచ్డీ, డాట్ డ్రాప్ డిస్ప్లే వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. కొత్త రెడ్మీ ఫోన్ను గ్లోబల్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయగా భారత్లో రిలీజ్కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.