న్యూఢిల్లీ : భారత్లో పిక్సెల్ 8 (Pixel 8) సిరీస్ను లాంఛ్ చేస్తున్నట్టు గూగుల్ అధికారికంగా ధ్రువీకరించింది. దేశీ మార్కెట్లో మూడు ప్రముఖ పిక్సెల్ సిరీస్ జనరేషన్స్ను మిస్ చేసిన అనంతరం గత ఏడాది పిక్సెల్ 7 సిరీస్ భారత్ ఎంట్రీని గూగుల్ ప్రకటించింది. అయితే పిక్సెల్ 7 సిరీస్కు భారత్లో మెరుగైన స్పందన లభించకపోవడంతో పిక్సెల్ 8 సిరీస్ భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టడంపై సందేహాలు నెలకొన్నాయి.
నెక్స్ట్ జనరేషన్ పిక్సెల్ 8 సిరీస్ భారత్లో సందడి చేస్తుందని గూగుల్ నిర్ధారించడంతో పిక్సెల్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రొ ధర అధికంగానే ఉంటుందని టెక్అవుట్లుక్, టెక్ అనలిస్ట్ పరాస్ గుగ్లానీ వెల్లడించారు. అయితే యూరోపియన్ మార్కెట్లతో పోలిస్తే భారత్లో పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లు కొంత తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
యూరప్ మార్కెట్లలో పిక్సెల్ 8 128జీబీ స్టోరేజ్ వేరియంట్ పన్నులతో కలిపి దాదాపు రూ. 78,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. పిక్సెల్ 8 ప్రొ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 1,10,220 పలుకుతుందని చెబుతున్నారు. ఇక యూరప్ తరహాలో భారత్లో పన్నులు ఉండని కారణంగా పిక్సెల్ 8 భారత్లో రూ. 60,000 నుంచి 65,000 మధ్య అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. న్యూ పిక్సెల్ 8 సిరీస్ భారత్కు వచ్చిన అనంతరం ధరల వివరాలు అక్టోబర్ 8న కంపెనీ వెల్లడిస్తుందని చెబుతున్నారు.
Read More :