న్యూఢిల్లీ : టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ (Mass Layoffs) గుబులు కొనసాగుతోంది. గత ఏడాది 1056 కంపెనీలు దాదాపు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించగా 2023లో కేవలం ఐదు నెలల్లోనే ఈ సంఖ్య దాటి పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. లేఆఫ్ ట్రాకింగ్ వెబ్సైట్ లేఆఫ్.ఎఫ్వైఐ వివరాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ 696 టెక్ కంపెనీలు లేఆఫ్స్కు తెగబడ్డాయి.
ఈ ఏడాది మే 18 నాటికి దాదాపు 1,97, 985 మంది టెకీలు కొలువులు కోల్పోయారు. ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు మెటా ఇప్పటికే ప్రకటించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను ఎలన్ మస్క్ టేకోవర్ చేసిన అనంతరం ఎడాపెడా లేఆఫ్స్ కొనసాగుతుండటం టెకీల్లో గుబులు రేపుతున్నది.
భారత్లో పనిచేసే ట్విట్టర్ ఉద్యోగులందరినీ దాదాపుగా ఇంటిబాట పట్టించారు. రాబోయే నెలల్లో ఉద్యోగులను తొలగించనున్నట్టు గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ప్రకటించాయి. పునర్వ్యవస్ధీకరణ ప్రక్రియను ఆయా కంపెనీలు పూర్తిచేసే పనిలో పడ్డాయి. ఇక భారత్లో పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులకు కత్తెర వేస్తున్నాయి. డుంజో, షేర్చట్, రెబెల్ ఫుడ్స్, భారత్ అగ్రి, ఓలా వంటి పలు కంపెనీలు లేఆఫ్స్కు తెరలేపాయి. యాక్సెంచర్ భారత్ విభాగంలోనూ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించారు.
Read More