వాషింగ్టన్ : భూమి వైపు మరో ఉల్క దూసుకు వస్తోంది. ఇప్పటివరకూ భూమి వైపు దూసుకుని వచ్చిన గ్రహశకలాలన్నింటి కంటే వేగంగా.. సెకనుకు 9 కిలోమీటర్ల వేగంతో వస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. గ్రహశకలం ఓ ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉంటుందని పేర్కొంది. మే 4న భూమికి దగ్గర నుంచి వెళ్తుందని, పరిమాణం 260 నుంచి 580 మీటర్ల వ్యాసార్థం ఉంటుందని అంచనా వేసింది. 2021 ఏఎఫ్-8గా నామకరణం చేసిన గ్రహశకలాన్ని మార్చిలో గుర్తించారు. ఇది ఇప్పటి వరకూ భూమి వైపు వచ్చిన గ్రహశకలాలు అన్నింటిలోకి చిన్నదే అయినా.. అది కదులుతున్న వేగం ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.
భూమికి సుమారు 3.4 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని, భూమికి ప్రమాదమేమి లేదని పేర్కొంది. ప్రస్తుతం నాసాలోని పలువురు శాస్త్రవేత్తల బృందం ఇప్పటికే గ్రహశకలాలను పరిశీలిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఇలాంటి గ్రహశకలాలను 22 వరకు గుర్తించారు. ఇందులో ఏదైనా రాబోయే వంద సంవత్సరాల్లో భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీటిలో అతిపెద్దదయిన గ్రహశకలం 29075 (1950డీఏ) 2880లో భూమిని ఢీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేశారు. ఈ ఆస్టరాయిడ్ యునైటెడ్ స్టేట్స్లోని ఎంపైర్ స్టేట్ భవనం కంటే మూడు రెట్లు పెద్దది.