న్యూఢిల్లీ : ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్స్తో చాకిరి చేయించుకుంటూ సీనియర్లకు మాత్రం భారీగా వేతనాలు ఇస్తున్నారని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, అరిన్ క్యాపిటల్ చైర్మన్ మోహన్దాస్ పాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధోరణి ఎన్నో ఏండ్లుగా ఐటీ పరిశ్రమలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. కంపెనీల తీరుతో వలసల రేటు పెరగడం, కార్యాలయాలకు తిరిగి రావడానికి ఉద్యోగుల విముఖత వంటి పరిణామాలకు దారితీస్తోందని దుయ్యబట్టారు.
డాలర్తో రూపాయి విలువ క్షీణించడంతో ఐటీ కంపెనీలకు ఆకర్షణీయ లాభాలు వస్తున్నాయని ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ మోహన్దాస్ పాయ్ పేర్కొన్నారు. రూపాయి విలువ పతనం కావడంతో ఐటీ కంపెనీల రాబడుల్లో 13 నుంచి 14 శాతం పెరుగుదల నమోదవుతోందని చెప్పారు. ఐటీ కంపెనీలకు పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుండటంతో సీనియర్లకు భారీగా వేతనాలు ఇస్తున్నారని జూనియర్లకు కూడా సరైన రీతిలో వేతనాలను ఎందుకు ఆఫర్ చేయడం లేదని ఐటీ కంపెనీలను పాయ్ నిలదీశారు.
గత పదేండ్లుగా ఫ్రెషర్స్ను ఐటీ పరిశ్రమ పీల్చిపిప్పిచేస్తోందని 2008-09లో ఫ్రెషర్స్కు ఐటీ కంపెనీలు చెల్లించే 3.5-3.8 లక్షల ప్యాకేజ్నే ఇప్పటికీ ఆఫర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎలాంటి త్యాగాలు చేయాల్సిన పరిస్ధితులు ఎదురైతే ముందుగా సీనియర్ ఉద్యోగులే త్యాగాలకు సిద్ధం కావాలని కోరారు. జూనియర్లకు అధిక వేతనాలు చెల్లించకుండా సీనియర్లకు వేతన పెంపు ఎలా చేపడతారని పాయ్ ప్రశ్నించారు. ఫ్రెషర్స్ను చిన్నపిల్లల్లా కాకుండా వారిని కూడా మనుషులుగా చూడండని హితవు పలికారు.