న్యూయార్క్ : ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్ మాతృ సంస్థ మెటా తాజా లేఆఫ్స్పై (Meta Layoffs )దృష్టి సారించింది. గత ఏడాది నవంబర్లో దాదాపు 11,000 మంది ఉద్యోగులను సాగనంపిన కంపెనీ లేటెస్ట్ లేఆఫ్స్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసేందుకు సన్నద్ధమైంది. తాజా లేఆఫ్స్లో భాగంగా ఇంజనీరింగేతర ఉద్యోగాలపై పెను ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. గత ఏడాది ఉద్యోగుల తొలగింపు సందర్భంగా ఓవర్ హైరింగ్, స్ధూల ఆర్ధిక పరిస్ధితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చిన మెటా ఇవే కారణాలతో తాజా తొలగింపులకు పూనుకుంది.
ఆదాయాలు పడిపోతుండటంతో ఖర్చులకు కళ్లెం వేయాలని కూడా మెటా నిర్ణయించింది. 2022 నాలుగో క్వార్టర్లో కంపెనీ ఆదాయం నాలుగు శాతం పడిపోగా, ఆర్ధిక సంవత్సరంలో ఆదాయం 1 శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది. కొన్ని ప్రాజెక్టులను కుదించడం మినహా మెటా పలు వ్యయ నియంత్రణ చర్యలకు పాల్పడుతున్నది. ఉద్యోగుల సామర్ధ్య సమీక్షలో భాగంగా వేలాది మంది ఉద్యోగులకు పేలవమైన రేటింగ్స్ ఇచ్చిన అనంతరం ఉద్యోగుల తొలగింపు వార్తలు మరింత ఊపందుకున్నాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇటీవల ఆర్ధిక ఫలితాల వెల్లడి సందర్భంగా లేఆఫ్స్పై సంకేతాలు పంపారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
గత ఏడాది లేఆఫ్స్ వంటి కొన్ని సంక్లిష్ట పరిస్ధితులు మనం ఎదుర్కొన్నాం..పలు టీంలను పునర్వ్యవస్ధీకరించుకున్నాం..అయితే సామర్ధ్యం దిశగా దృష్టి సారించడంలో ఇది తొలి అడుగని, ఇదే చివరిది కాదని తాను చెప్పగలనని జుకర్బర్గ్ వ్యాఖ్యానించారు. స్ధూల ఆర్ధిక పరిస్ధితులు మెరుగవకుంటే మెటానే కాకుండా ఇతర టెక్ దిగ్గజాలు సైతం రాబోయే నెలల్లో కొలువుల కోతకు దిగవచ్చని భావిస్తున్నారు. అమెజాన్ ఇప్పటికే 18,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు కసరత్తు సాగిస్తుండగా, ఎలన్ మస్క్ సారధ్యంలోని ట్విట్టర్ సైతం ఖర్చులు తగ్గించుకునేందుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది.
Read More :