న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో పలు టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో మాస్ లేఆఫ్స్కు తెగబడుతుండగా తాజాగా ఎరిక్సన్ (Ericsson Layoffs)ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఉద్యోగ, కార్మిక సంఘాలతో సంప్రదింపుల అనంతరం లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నామని టెలికాం నెట్వర్కింగ్ కంపెనీ ఎరిక్సన్ తెలిపింది.
ఉద్యోగులను తొలగించడం సులభం కాదని, ఇది సంక్లిష్ట నిర్ణయమని ఉద్యోగుల పట్ల గౌరవం, ప్రొఫెషనలిజంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. సంబంధిత సిబ్బందికి తొలుత పూర్తి వివరాలు తెలియచేస్తామని ఎరిక్సన్ తెలిపింది. కన్సల్టంట్ల తగ్గింపు, వివిధ ప్రాసెస్ల క్రమబద్ధీకరణ, సౌకర్యాల్లో కోత వంటి పలు వ్యయ నియంత్రణ చర్యలు ఉంటాయని పేర్కొంది. గతంలో వెల్లడించిన విధంగా ఉద్యోగుల తగ్గింపూ తప్పదని ఎరిక్సన్ స్పష్టం చేసింది.
స్వీడన్లో ఉద్యోగుల తొలగింపు ప్రభావం ఇతర దేశాలపైనా ఉంటుందని భావిస్తున్నారు. స్వీడన్ కేంద్రంగా ఎరిక్సన్లో 14,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే పలు టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. అమెజాన్, ట్విట్టర్, మెటా వంటి కంపెనీలు పలువురు ఉద్యోగులను సాగనంపాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాస్ లేఆఫ్స్కు ప్రత్యామ్నాయంగా వేతన ప్యాకేజ్ల్లో భారీగా కోతపెడుతున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు ఇంటెల్, విప్రో ఈ దిశగా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా ఫ్రెషర్స్ వార్షిక వేతన ప్యాకేజ్లో ఏకంగా 50 శాతం కోత విధించింది.
Read Also :