న్యూఢిల్లీ : పలు బహుళజాతి, దేశీ టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్కు పాల్పడుతున్న సమయంలో దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ (TCS) కీలక ప్రకటన చేసింది. కొలువుల కోతతో ఉద్యోగాలు కోల్పోయిన స్టార్టప్ ఉద్యోగులను తాము విధుల్లోకి తీసుకుంటామని టీసీఎస్ పేర్కొంది. టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ అధికారి మిలింద్ లక్కడ్ ఈ దిశగా విస్పష్ట సంకేతాలు పంపారు.
ఒక ఉద్యోగిని విధుల్లోకి తీసుకున్న తర్వాత సుదీర్ఘ కెరీర్ అందించేందుకు నైపుణ్యాలకు పదును పెట్టడంపై దృష్టి సారిస్తామని, తమకు లేఆఫ్స్పై విశ్వాసం లేదని పేర్కొన్నారు. కంపెనీలు తమకు అవసరమైన ఉద్యోగుల కంటే అధికంగా హైర్ చేయడంతోనే ఆయా కంపెనీలు లేఆఫ్స్ చేపట్టాల్సి వచ్చిందని లక్కడ్ తెలిపారు.
టీసీఎస్లో ఒక ఉద్యోగి చేరితే వారిని ఉత్పాదకత దిశగా మలచడంతో పాటు అధిక విలువను అందించేలా వారికి శిక్షణను కంపెనీ అందిస్తుందని తెలిపారు. గత సంవత్సరాల్లో మాదిరిగానే ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటిస్తామని చెప్పారు. టీసీఎస్లో మొత్తం 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో స్టార్టప్లు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండగా బాధిత ఉద్యోగుల నియామకం దిశగా టీసీఎస్ దృష్టి సారిస్తుందని లక్కడ్ వెల్లడించారు.