‘సెల్ఫోన్ టవర్ల నుంచి, మొబైల్స్ నుంచి వెలువడే రేడియేషన్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’ అనే ప్రశ్న దశాబ్ద కాలంగా వినిపిస్తున్నదే. దీనికి స్పష్టమైన జవాబులు మాత్రం లేవు. సెల్ఫోన్ మొహానికి దగ్గరగా ఉన్నప్పుడు మెదడు మీద దుష్ప్రభావాలు ఉంటాయని, ప్యాంట్ జేబులో పెట్టుకుంటే వీర్యకణాలు తగ్గిపోతాయనీ, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయనీ.. రకరకాల అభిప్రాయాలు ప్రచారంలో అయితే ఉన్నాయి. వీటిమీద జరిగిన ప్రయోగాలు మాత్రం పరస్పర విరుద్ధ ఫలితాలనే వెలువరిస్తున్నాయి.
సెల్ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్ (ఇదే పనితీరు ఆధారంగా మైక్రోవేవ్ ఓవెన్లు పనిచేస్తాయి). కణాలు వేడెక్కడం ద్వారా వాటి పనితీరు, జన్యు నిర్మాణం దెబ్బతింటుంది. సెల్ఫోన్ రేడియేషన్ ఆ స్థాయిలో లేదన్నది చాలామంది అభిప్రాయం. ప్రభుత్వం సూచించిన సురక్షిత పరిమితుల మేరకే, ఫోన్ రేడియేషన్ ఉంటున్నదని వారి వాదన. ఈ వివాదం తేలనంత వరకూ, వాటి వినియోగంలో కాస్త జాగ్రత్త వహించడంలో నష్టమేమీ లేదు. స్పీకర్ ఫోన్లో మాట్లాడటం, ఫోన్ నిరంతరం జేబులో కాకుండా పక్కన ఉంచుకోవడం, రాత్రి పడుకునేటప్పుడు కాస్త దూరంగా పెట్టడం లాంటి జాగ్రత్తలు పాటించమంటున్నారు విశ్లేషకులు. మొక్కలు, పక్షుల మీద సెల్ఫోన్ టవర్ల రేడియేషన్ ప్రభావం ఉందని కొందరు పరిశోధకుల నమ్మకం. అయస్కాంత శక్తిమీద ఆధారపడే పక్షులను సెల్టవర్లు అయోమయానికి గురి చేస్తాయనీ, వీటి నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ వాటి గుడ్లను నాశనం చేస్తాయనీ వారంటున్నారు. ఈ విషయాల గురించి కూడా కచ్చితమైన సమాచారం లేకపోవడం ఆశ్చర్యకరం.
ఫోన్ రేడియేషన్ గురించి తేలే దాకా 5జీ సేవలకు అనుమతి ఇవ్వకూడదంటూ ఈ మధ్యే నటి జూహీ చావ్లా దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ( ఈ వ్యవహారంలో న్యాయస్థానం ఆమె మీద కన్నెర్రజేసింది కూడా). 5జీతో రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోతుందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతుందని ఆమె వాదన. ఫోన్ల వేగం పెరుగుతున్న కొద్దీ యువత, పిల్లలు వాటికి మరింత అతుక్కు పోతున్నారు. 5జీ వేగంతో వచ్చే ఫోన్లు వారిని ఇంకా కట్టి పడేసే ప్రమాదం లేకపోలేదు.
పలు దేశాల్లో 5జీ సేవలతోపాటే కరోనా విజృంభించడం యాదృచ్ఛికం. దాంతో ఈ రెండింటి మధ్యా ఏదో సంబంధం ఉందనే అపోహ మొదలైంది. 5జీ కోసం నిర్మితమయ్యే శక్తిమంతమైన టవర్లు, మన రోగ నిరోధక శక్తిని బలహీన పరుస్తున్నాయని, దాంతో కరోనా వైరస్ త్వరగా దాడి చేసే ప్రమాదం ఉందనే అపనమ్మకం బయల్దేరింది. స్వీడన్ నుంచి ఇటలీ వరకూ అనేక ధనిక దేశాల్లోనూ ఈ భావన కనిపించడం విచిత్రం. ఇంగ్లండ్లో అయితే ఏకంగా సెల్ఫోన్ టవర్ల మీద దాడులు మొదలయ్యాయి. భారతదేశంలోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా పుకార్లు వచ్చాయి. కానీ, మన దేశంలో ఇంకా 5జీ సేవలు మొదలు కాలేదంటూ సెల్ఫోన్ ఆపరేటర్ల సమాఖ్య వివరణ ఇచ్చింది కూడా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గూగుల్లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!
3జీ, 4జీ, 5జీ తెలుసు.. మరి ‘జీరో’ జీ ఉందని తెలుసా !
5G రావడానికి ఎందుకంత లేటవుతుంది? ఆలస్యం మంచికేనా?