1జీ.. 2జీ అంటూ మొబైల్ టెక్నాలజీ బుడిబుడి అడుగులతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత 3జీతో వేగం పెంచుకొని, సరికొత్త సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. సెల్ ఫోన్తో దేశాన్ని డిజిటల్మయం చేసింది. ఆ వెంటే వచ్చిన 4జీ అద్భుత వేగంతో మానవ జీవితాలపై తిరుగులేని ముద్ర వేసింది. స్మార్ట్ ఫోన్ ద్వారా యావత్ ప్రపంచాన్ని అరచేతుల్లోకి తీసుకొచ్చింది. వన్, టూ, త్రీ, ఫోర్.. అంటూ పరుగులు తీసి, ప్రస్తుతం ఐదో తరానికి చేరుకుంది. ఇప్పటికే అమెరికా, చైనా వంటి దేశాల్లో 5G ప్రభ వెలిగిపోతున్నది. కానీ భారత్లో 5G సేవలు అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తుంది. అసలు 4Gతో పోలిస్తే 5Gతో ఉన్న ప్రయోజనాలేంటి? 5జీ రావడానికి ఎందుకంత ఆలస్యమవుతోంది? ఆలస్యం మంచికేనా?
5జీ.. అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. పైగా రేడియో తరంగాలను సమృద్ధిగా, సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. ‘నెట్వర్క్ స్లైసింగ్’ అనే ప్రక్రియ ద్వారా సిమ్కార్డు అనేక తరంగాలను ఒకేసారి వినియోగించుకుంటుంది. ఇలాంటి మార్పులతో అసాధారణ ఫలితాలు కనిపిస్తాయి.
– సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకునే వేగం సెకనుకు పది గిగాబైట్ల వరకూ ఉంటుంది. ఇది 4జీ కంటే దాదాపు వందరెట్లు ఎక్కువ.
– 5జీ అవసరాన్నిబట్టి రకరకాల తరంగాలను వినియోగించుకుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, ఫోన్తో జోడించిన వస్తువులు పని చేసేటప్పుడు మరోలా. ఇలా వేర్వేరు పనులను ఒకేసారి సమర్థంగా చేయగలుగుతుంది.
– ఈ ఫోన్లలో బ్యాటరీ వినియోగం తగ్గే అవకాశం ఉన్నది. సిగ్నల్స్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, సమాచారాన్ని అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం, స్పందనకోసం ఎక్కువ సమయం వృథా చేయక పోవడం.. లాంటి చర్యలతో బ్యాటరీ జీవితకాలం పెరుగవచ్చని అంచనా.
– సమాచారం వెళ్లడానికీ, తిరిగి జవాబు రావడానికీ మధ్య ఉండే సమయాన్ని ‘లేటెన్సీ’ అని పిలుస్తారు. 4జీలో ఈ సమయం 250 మిల్లీసెకండ్ల వరకూ ఉంటే, 5జీలో మాత్రం కేవలం 1 మిల్లీసెకను మాత్రమే. అంటే, కన్నుమూసి తెరిచేలోగా మన ఆదేశాలు అమలవుతాయన్నమాట.
– 5జీలోని తరంగాల సామర్థ్యం వల్ల సిగ్నల్ సరిగా లేకపోవడం, మధ్యలోనే కాల్స్ కట్ కావడం లాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఈ సాంకేతికత ఎంతటి ట్రాఫిక్ను అయినా తట్టుకుంటుంది. దాంతో ‘న్యూ ఇయర్’ రోజు కూడా ‘నెట్వర్క్ బిజీ’ అనే మాట వినిపించదు.
5జీ ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టు ముట్టేసింది. యూరప్తోపాటు మన సమీపంలోని థాయ్లాండ్, సింగపూర్ దేశాల్లోనూ దాని ఉనికి కనిపిస్తున్నది. కానీ, మన దేశంలో 5జీ ప్రయాణం మందకొడిగా సాగుతున్నది. దీనికి కారణాలేంటి? అంటే, చాలా జవాబులే వినిపిస్తాయి. కొవిడ్ వల్ల స్పెక్ట్రమ్ వేలం ఆలస్యం కావడం ఓ ముఖ్యకారణం. పైగా టెలికామ్ సంస్థలు 3జీ, 4జీ కోసం చేసిన ఖర్చునుంచి పూర్తిగా తేరుకోనేలేదు. కాబట్టి, అవి కూడా అంత త్వరపడటం లేదు. అంతేకాదు, 5జీకి అనుగుణంగా మరిన్ని సెల్టవర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఆ డేటా వేగాన్ని తట్టుకునేందుకు పాత రాగి వైర్లకు బదులుగా పూర్తిగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను వాడాల్సి ఉంటుంది. ఈ మౌలికమైన మార్పుల కోసమూ కొంత సమయం పడుతుంది. వినియోగదారుల రక్షణ గురించి కూడా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. మన డేటాను దొంగిలిస్తున్నాయన్న అపవాదు ఉన్న హువావెయ్, ZTE.. లాంటి మొబైల్ కంపెనీలకు మన దేశంలో 5జీ ఫోన్లు విక్రయించే అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి ఎన్నో సాంకేతిక, ఆచరణాత్మక కారణాలతో 5జీ మన దగ్గర ఆలస్యమవుతున్నది. అదీ ఒకందుకు మంచిదేనేమో. ఎందుకంటే, కొన్ని దేశాలు సరైన మౌలిక సదుపాయాలు లేకుండా తొందరపడి 5జీని అమలు చేసి నాలుక కరుచుకున్నాయి. కాబట్టి, 5జీ కోసం కాస్త ఓపిక పడదాం. దాంతో ఎన్ని అద్భుతాలు చేయవచ్చో కలలు కందాం. ఆ తర్వాత అద్భుతాలను ఆస్వాదిద్దాం.
ఒకానొక అంచనా ప్రకారం 5జీ అందుబాటులోకి రాగానే దాన్ని అందుపుచ్చుకునేందుకు 67 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. మరి, ధరలు అందుకు అనుమతిస్తాయా? 4జీతో పోల్చుకుంటే 5జీ సేవలు కచ్చితంగా ఖరీదే! అయితే, పారిశ్రామిక వర్గాలనుంచి ఎక్కువ వసూలు చేస్తే సాధారణ వినియోగదారుల భారాన్ని తగ్గించవచ్చనే ఆలోచనలో టెలికాం కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక కూడా 4జీ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తున్నాయి. పైగా, మారుతున్న సాంకేతికత వల్ల 4జీ వేగం కూడా పెరిగే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
3జీ, 4జీ, 5జీ తెలుసు.. మరి ‘జీరో’ జీ ఉందని తెలుసా !
ఆన్లైన్ క్లాసుల కోసం లాప్టాప్ కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఐఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని కాపాడుకోవడమెలా?
ఐఫోన్ పాస్కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి