న్యూఢిల్లీ : మూన్లైటింగ్గా వ్యవహరించే రెండో జాబ్ ద్వారా ఉద్యోగి ఆదాయాన్ని ఆర్జించే పద్ధతికి వ్యతిరేకంగా భారత్ టెక్ కంపెనీల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు గళమెత్తుతున్నారు. ఉద్యోగులు రెండో జాబ్ చేపట్టడంపై తాజాగా దేశీ టెక్ దిగ్గజం ఇన్పోసిస్ తన ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.
ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని చేపట్టేముందు ఉద్యోగులు ఒకసారి తమ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టును చదవాలని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో కంపెనీ స్పష్టం చేసింది. పనివేళల్లో, పని వేళలు ముగిసిన తర్వాత రెండో జాబ్ చేసే ఉద్యోగులను తొలగిస్తామని కూడా ఇన్ఫోసిస్ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘిస్తే వేటు తప్పదని స్పష్టం చేసింది. రెండు ఉద్యోగాల పద్ధతిని కంపెనీ ఎట్టిపరిస్ధితుల్లో ఉపేక్షించదని ఈమెయిల్లో తేల్చిచెప్పింది.
ఇన్పోసిస్ అనుమతి లేకుండా ఎలాంటి ఫుల్టైం, పార్ట్టైం ఉద్యోగాన్ని ఉద్యోగి చేపట్టరాదని ఆఫర్ లెటర్, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టులో స్పష్టంగా కంపెనీ ప్రస్తావించిన విషయాన్ని ఈమెయిల్ గుర్తు చేసింది. రిమోట్ వర్కింగ్కు మళ్లిన క్రమంలో మూన్లైటింగ్ కేసులు పెరిగాయని కూడా ఈమెయిల్లో ఇన్ఫోసిస్ పేర్కొంది. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపుతున్నట్టు కంపెనీ గుర్తించింది. మూన్లైటింగ్ వ్యవహారం ఉత్పాదకతతో పాటు, ఉద్యోగ సామర్ధ్యం, డేటా రిస్క్, గోప్యతతో కూడిన డేటా బహిర్గతమయ్యే ముప్పు వంటి తీవ్ర సవాళ్లకు దారితీస్తోందని ఇన్ఫోసిస్ ఆందోళన వ్యక్తం చేసింది.