Artificial Heart | గుండె జబ్బులు ఇటీవలి కాలంలో మరింత ఎక్కువయ్యాయి. జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బులు వేధిస్తున్నాయి. వీటికి తోడు కరోనా వంటి అంటువ్యాధుల వల్ల కూడా గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గుండెపోటుకు గురైన వ్యక్తిని ఆపదలో ఆదుకునేందుకు కాన్పూర్లోని ఐఐటీ వైద్యనిపుణులు కృత్రిమ గుండెను తయారు చేశారు. దీని ద్వారా గుండెను మార్పిడి చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కేజీఎంయూ 118 వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరిపిన అనంతరం రానున్న రెండేండ్లలో మనుషులకు కృత్రిమ గుండెను అమర్చేలా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య శాఖ మాజీ హెడ్ డాక్టర్ ప్రభాత్ సిథోలే, కేజీఎంయు వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిపిన్ పూరి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినీత్ శర్మతోపాటు పలువురు వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా రక్తాన్ని అందించడం ఈ కృత్రిమ గుండెతో సాధ్యమయ్యేలా చేస్తున్నామని, ఈ పరిశోధన విజయవంతమైతే గుండె మార్పిడి మరింత సులువవుతుందని ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ చెప్పారు. ఇది ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నదని, త్వరలోనే జంతువులపై పరిశోధనలు చేపడతామన్నారు. మన దేశంలోని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు కలిసి అనేక కొత్త చికిత్సా పద్ధతులను అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. కరోనా సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడారని, విదేశాల నుంచి రూ.10-12 లక్షలకు వచ్చే వెంటిలేటర్లను కేవలం 90 రోజుల్లోనే సిద్ధం చేసి రూ.2.5 లక్షలకు అందుబాటులోకి తెచ్చారన్నారు. మన దేశంలో గుండె జబ్బులకు సంబంధించి అవసరమైన 20 శాతం పరికరాలు మాత్రమే తయారవుతున్నాయని, 80 శాతం ఇంప్లాంట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు.
మన దేశంలో ఆరోగ్య కార్యకర్తల కొరత వేధిస్తున్నదని, ప్రతి వేయి మందికి 0.8 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారని అభయ్ కరాండికర్ చెప్పారు. దీనిని అధిగమించేందుకు కృత్రిమ మేధస్సు, టెలిమెడిసిన్, ఈసంజీవని, ఈఫార్మసీ వంటి టెక్నిక్లను అభివృద్ది చేయాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పారు. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న 5 జీ తో లింక్ చేయడం వల్ల ఎక్కువ మంది రోగులకు సరైన చికిత్స అందించే వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.