SBI | టెక్నాలజీ రోజురోజుకూ ఎంతగా అభివృద్ధి చెందుతోందో.. అంతగా సైబర్ క్రిమినల్స్ కూడా తమ నేరాలకు కొత్త దారులను వెతుక్కుంటున్నారు. వాట్సప్లో ఫిషింగ్ లింక్స్ పంపించడం.. మెయిల్స్ పంపించడం.. ఫోన్ చేసి పర్సనల్ విషయాలు అడగడం లాంటి సైబర్ నేరాలను ఎన్నో చూశాం. తాజాగా సైబర్ క్రిమినల్స్ ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్ చేసుకున్నారు. వాళ్లకు మెసేజ్లు పంపిస్తూ.. వాళ్లను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
మీ ఎస్బీఐ అకౌంట్ బ్లాక్ అయిందని.. దాని కోసం వెంటనే ఈకేవైసీ చేయించాలని.. ఈ లింక్ క్లిక్ చేసి.. కేవైసీ వివరాలు ఇవ్వాలంటూ కొందరు ఎస్బీఐ ఖాతాదారులకు మెసేజ్లు వస్తున్నాయి. ఆ మెసేజ్లను చూసి కొందరు నిజమే అనుకొని.. సైబర్ నేరగాళ్లు ఇచ్చిన ఫిషింగ్ లింక్స్పై క్లిక్ చేసి.. వాళ్లు అడిగిన వివరాలు ఇచ్చి అడ్డంగా బుక్ అయిపోతున్నారు.
చాలామంది ఎస్బీఐ ఖాతాదారులు ఆయా మెసేజ్లను చూసి అకౌంట్ ఎక్కడ బ్లాక్ అవుతుందోనని తెగ టెన్షన్ పడిపోతున్నారు. వాళ్లు అడిగిన వివరాలతో పాటు డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేస్తున్నారు.
ఇది పక్కా ఫేక్ మెసేజ్ అని.. సైబర్ నేరగాళ్లు కావాలని ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్ చేసి.. వాళ్లు పంపించిన లింక్ ఓపెన్ చేసి పర్సనల్ డిటెయిల్స్ ఇవ్వగానే వాళ్ల అకౌంట్ను కొల్లగొడతారని.. ఎస్బీఐ నుంచి అటువంటి మెసేజ్ ఎప్పుడూ ఖాతాదారులకు రాదని.. పీఐబీ ట్వీట్ చేసింది. ఒకవేళ అటువంటి మెసేజ్లు వస్తే.. దానికి సంబంధించి report.phishing@sbi.co.in కి ఈమెయిల్ చేయాలని కోరింది. ఒకవేళ అలాంటి మెసేజ్లకు రిప్లయి ఇచ్చినా.. లింక్స్ క్లిక్ చేసి వివరాలు ఇచ్చినా సైబర్ నేరగాళ్లు వెంటనే అకౌంట్ను టార్గెట్ చేస్తారని.. బ్యాంకు వివరాలతో అకౌంట్లోని డబ్బులను తస్కరిస్తారని చెప్పుకొచ్చింది. బ్యాంకులు కూడా తమ కస్టమర్లను ఈ విషయంలో హెచ్చరిస్తూనే ఉంటాయి. తాము ఎప్పుడూ ఇటువంటి మెసేజ్లు పంపించమని.. ఏటీఎం కార్డు వివరాలు అడగమని కస్టమర్లకు చెబుతున్నప్పటికీ.. కొందరు కస్టమర్లు సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడుతున్నారు.