Google on CCI Ruling | కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలకు గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ దిగి వచ్చింది. ‘ఇన్యాప్’ కొనుగోళ్లు జరుపుతున్న భారత్లోని యాప్ డెవలపర్లకు గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ తప్పనిసరన్న నిబంధనను తొలగించింది. భారత్లోని యాప్ డెవలపర్లకు ప్లే బిల్లింగ్ తప్పనిసరి అన్న నిబంధనను ఉపసంహరించడానికి గూగుల్కు సోమవారం వరకు సీసీఐ అనుమతి ఇచ్చింది. గూగుల్కు వ్యతిరేకంగా సీసీఐ రెండు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
‘భారత్లోని యాప్ డెవలపర్లు తమకు అవసరమైన డిజిటల్ గూడ్స్, లావాదేవీల సేవలకు గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ అమలు చేయరాదని సీసీఐ ఇటీవల జారీ చేసిన రూలింగ్ను గౌరవిస్తున్నాం. భారత్లోని యాప్ డెవలపర్లకు గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ తప్పనిసరి అన్న నిబంధనను ఉపసంహరిస్తున్నాం. సీసీఐ ఆదేశాలపై తదుపరి న్యాయపరమైన సమీక్ష కోసం ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తాం. ఆండ్రాయిడ్ అండ్ ప్లే ప్లాట్ఫామ్లపై ఇన్వెస్ట్మెంట్ కొనసాగిస్తాం’ అని గూగుల్ సపోర్ట్ పేజీ పేర్కొంది.
అయితే, భారత్ బయట అభివృద్ధి చేసిన ఇన్-యాప్ డిజిటల్ కంటెంట్ కొనుగోళ్లకు మాత్రం ప్లే బిల్లింగ్ సిస్టమ్ వర్తిస్తుందని తెలిపింది. గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ అన్యాయమైన విధానం అని సుదీర్ఘ కాలంగా భారత్లోని యాప్ డెవలపర్లు వాదిస్తున్నారు.
ప్లే స్టోర్ క్యాటగిరీలో గూగుల్, తన ఆధిపత్య ధోరణిని దుర్వినియోగం చేస్తున్నదని పేర్కొంటూ సీసీఐ రెండు సార్లు గూగుల్పై జరిమాన విధించింది. ప్లే స్టోర్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు తొలుత రూ.936.4 కోట్లు, ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్తో సంబంధం ఉన్న బహుముఖ క్యాటగిరీల్లో తనకు ఉన్న ఆధిపత్యాన్ని దుర్వినయోగ పరిచిందంటూ రెండో దఫా రూ.1,338 కోట్ల జరిమాన విధించింది.
భారత్లో యాప్ డెవలపర్లకు పేమెంట్ సిస్టమ్ నిబంధనల అమలు గడువును 2021లో పలు దఫాలు పొడిగించింది గూగుల్. తాజాగా పొడిగించిన గడువు గత నెల 31 (సోమవారం)తో ముగిసింది. నిర్దేశిత గడువులోగా ప్లే స్టోర్ బిల్లింగ్ సిస్టమ్ను ఉపసంహరించుకోవాలని గూగుల్ను సీసీఐ కోరింది. యూపీఐ, వాలెట్లతోపాటు యూజర్లు తమకు సౌకర్యవంతంగా ఉన్న పేమెంట్స్ సిస్టమ్స్లో చెల్లింపులకు అనుమతించాలని సీసీఐ కోరింది. భారత్ రికరింగ్ డిజిటల్ పేమెంట్స్ గైడ్లైన్స్లో మార్పులకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు యాప్ డెవలపర్లకు మరింత గడువు విధించింది.
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వ్యవస్థలోని యాప్ డెవలపర్లకు కీలక సరఫరా చానెల్గా గూగుల్ ప్లే స్టోర్ వ్యవహరిస్తున్నది. మార్కెట్లోకి వచ్చే యాప్లపై డెవలపర్లపై రెగ్యులేటరీ నిబంధనలు అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ / బిల్లింగ్ యాప్లను యాప్ డెవలపర్లు కొనుగోలు చేయకుండా అడ్డుకోరాదని సీసీఐ ఆదేశించింది.