న్యూయార్క్ : ఓపెన్ఏఐ చాట్జీపీటీ లాంఛ్ చేసినప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై హాట్ డిబేట్ సాగుతోంది. మన రోజువారీ జీవితాల్లో టెక్నాలజీ అంతర్భాగం కానుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ రాకతో దాదాపు ప్రతిరోజూ నూతన టెక్నాలజీల దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఏఐతో పెను ముప్పు, సవాళ్లు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నా న్యూ టెక్నాలజీతో ఉత్పాదకత పెరుగుతుందని, జీవితాలు సరళతరం అవుతాయని మరికొందరు చెబుతున్నారు.
ఇప్పటికే పలు కంపెనీలు ఏఐ టెక్నాలజీని పలు విభాగాల్లో వాడుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్ధపాకులు బిల్ గేట్స్ (Bill Gates) ఏఐ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ రాకతో 2024లో వేగంగా పలు ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయని అన్నారు. పరిమిత వనరులు కలిగిన ప్రపంచంలో మనం గరిష్ట ప్రభావం ఉండే మార్గాలను గుర్తించాలని సంవత్సరాంత బ్లాగ్ పోస్ట్లో గేట్స్ రాసుకొచ్చారు. మనం ఖర్చు చేసే డబ్బుకు సరైన విలువను పొందడం వినూత్న ఆవిష్కరణలతో సాధ్యమని స్పష్టం చేశారు. గతంలో మనం చూడనంత వేగంతో నూతన ఆవిష్కరణలు చోటుచేసుకునే క్రమం ఏఐతో సాక్షాత్కారమవుతుందని చెప్పారు.
నూతన ఔషధాలను సృష్టించడంలో ఏఐ భారీ వ్యత్యాసం చూపుతుందని చెప్పుకొచ్చారు. కొత్త మందులు కనిపెట్టే క్రమంలో మనం చాలా డేటాను మదించాల్సి ఉంటుందని, ఏఐ టూల్స్ దీన్ని మరింత వేగంగా చేపడతాయని అన్నారు. కొన్ని కంపెనీలు క్యాన్సర్ మందులను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ఏఐని వాడుతున్నాయని గేట్స్ పేర్కొన్నారు. పేదలను పీడించే ఎయిడ్స్, మలేరియా, టీబీ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడే పేదలకు సైతం ఈ ఏఐ టూల్స్ సాయం అందేలా చూడాలని గేట్స్ ఫౌండేషన్ కోరుతోందని అన్నారు.
Read More :