Sundar Pichai | ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తుందన్న భయాల మధ్య టెక్ దిగ్గజాలు, ఇతర కార్పొరేట్ సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. గతవారం గూగుల్ కూడా 12 వేల మంది ఉద్యోగులపై లేఆఫ్లు ప్రకటించింది. తర్వాత టౌన్హాల్లో జరిగిన సంస్థ ఉద్యోగుల సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ మాట్లాడుతూ.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, అంతకంటే పై స్థాయిలో పని చేస్తున్న ఎగ్జిక్యూటివ్ల వేతనాల్లోనూ కోత విధిస్తామని ప్రకటించారు.
అయితే, తన వేతనంలోనూ కోత విధించాలని సిబ్బందికి సూచించినట్లు వార్తలొచ్చాయి. తన వేతనంలో ఎంత తగ్గిస్తారన్న సంగతి మాత్రం బయటకి రాలేదు. ఇక నుంచి ఏడాదికోసారి ఇచ్చే బోనస్ తగ్గిస్తామని, సీనియర్ ఎగ్జిక్యూటివ్ల పనితీరు ఆధారంగానే వార్షిక బోనస్ ఇస్తామని సుందర్ పిచ్చాయ్ తెలిపారు. ఇటీవల ఈ-మెయిల్ ద్వారా 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సుందర్పిచ్చాయ్ వెల్లడించడం విమర్శలకు దారి తీసింది.
తమ తొలగింపునకు బదులు ఉన్నతస్థాయిలో పని చేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ల వేతనాలు తగ్గించాలని ఉద్యోగులు పేర్కొన్నట్లు సమాచారం. తమ అభిప్రాయాలు చెప్పుకునే చాన్స్ కూడా ఇవ్వలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారని వినికిడి. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా తన వేతనంలో 40 శాతం కోత విధించుకున్న సంగతి గూగుల్ ఉద్యోగులు గుర్తు చేశారట. దీంతో సుందర్ పిచ్చాయ్ కూడా తన వేతనంలో కోత విధించుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.