AI Technology | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఎన్నికల వేళ ప్రజల మూడ్ను పసిగట్టే కొత్త టెక్నాలజీపై ఏఐ నిపుణులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటే ర్యాలీలు, సభలు, యాత్రలతో సందడి వాతావరణం నెలకొంటుంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల కంటే ప్రచారంలో పాల్గొనే సాధారణ ప్రజల హవా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనే జనాల మూడ్ను అంచనా వేసేందుకు ప్రత్యేక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే విధానం ద్వారా సమావేశాలు, మహాసభలు, ర్యాలీల్లో పాల్గొన్న జనాలు ఆ పార్టీ గురించి ఏమని ఆలోచిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ముంబై కంప్యూటర్ నిపుణులు చేపట్టిన ఈ ప్రాజెక్టు రానున్న రోజుల్లో ఎన్నికల ప్రక్రియల్లో కీలకంగా మారనుందని టెక్ నిపుణులు చెప్తున్నారు.
జనాల మూడ్ పసిగట్టేలా
ఎన్నికల సందర్భంగా జరిగే సభలు, సమావేశాలు, ర్యాలీలు, వాహన యాత్రల్లో పాల్గొనే జనాల మూడ్ను పసిగట్టేందుకు ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎనాలసిస్ టెక్నాలజీని నిపుణులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ముఖ కవళికలను బట్టి వారి మానసికస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఆలోచన పరిపక్వత, శారీరక రుగ్మతలను అంచనా వేస్తున్నారు. అలాంటి సమాచారానికి అదనంగా మరికొన్ని అంశాలను జతచేసి జనాల మూడ్, ఆలోచన ధోరణిని టెక్నాలజీ ద్వారా విశ్లేషించేలా ఏఐని రూపకల్పన చేస్తున్నారు. ఒకసారి సభలు, సమావేశాలకు హాజరైన వారి వీడియోలు, ఫొటోలను ఏఈ టెక్నాలజీతో కూడిన ఎనాలసిస్ వ్యవస్థకు అనుసంధానం చేయగానే వాటిని విశ్లేషించి సంబంధిత సమావేశంపై కలిగిన అభిప్రాయాన్ని హావాభావాలతో గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ తరహా టెక్నాలజీ ప్రయోగదశలో ఉండగా.. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, జనాల మూడ్ను ఖచ్చితంగా అంచనా వేసేందుకు వీలు కలుగుతుందని ఐఐటీ హైదరాబాద్ టెక్ నిపుణులు భావిస్తున్నారు.