ఓ వైపు ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. అంతరిక్ష ప్రయోగాలపైనా దృష్టిపెట్టింది. రష్యాకు చెందిన ముగ్గురు వ్యోమగాములు శనివారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకున్నారు. ముగ్గురు వ్యోమగాములతో కూడిన రష్యా అంతరిక్ష వాహక నౌక శుక్రవారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఐఎస్ఎస్కు చేరుకున్నవారిలో రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ వ్యోమగాములు ఒలేగ్ ఆర్టెమియేవ్, డెనిస్ మాట్వీవ్, సెర్గీ కోర్సకోవ్ ఉన్నారు.
కజకిస్తాన్లోని బైకనూర్ నుంచి శుక్రవారం రాత్రి 8.55 గంటలకు సోయుజ్ MS-21 అంతరిక్ష వాహక నౌక ముగ్గురు వ్యోమగాములతో బయలుదేరింది. శనివారం ఉదయం వ్యోమగాములు నిర్దేశిత కక్ష్యకు సురక్షితంగా చేరుకున్నారు. రష్యా -ఉక్రెయిన్పై యుద్దం మొదలైన తర్వాత రష్యా నిర్వహించిన మొదటి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం గమనార్హం.