షాబాద్, మే 3 : హై స్కూల్ విద్యార్థులకు గ్రంథాలయ సేవలు అందేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మంత్రి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, సంస్థ కార్యదర్శి మనోజ్కుమార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నూతన గ్రంథాలయాల భవనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రంథాలయాల అభివృద్ధికి చేపట్టిన చర్యల్లో భాగంగా మోడల్ గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా నూతనంగా రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని హై స్కూల్ ప్రాంగణాల్లో గ్రంథాలయాల ఏర్పాటు విషయంపై మంత్రి చర్చించారు. ప్రయోగాత్మకంగా చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మోడల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకుగాను హై స్కూల్ ప్రాంగణంలో రెడీమెడ్ కంటైనర్, ఫర్నిచర్, పుస్తకాలను సమకూర్చాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలోని గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని తెలిపారు.