-సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం
హత్నూర : ప్రమాదవశాత్తు హార్డ్వేర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం జరిగిన ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్లో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వ్యాపారి కూశినారాయణకు చెందిన హార్డ్వేర్ షాపులో ర్యాకుల ఏర్పాటు కోసం వెల్డింగ్ చేస్తుండగా అగ్గి మెరుపులు పక్కనేవున్న టర్పాంటాయిల్ డబ్బాలపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇతర సామగ్రికి వ్యాపించాయి. షాప్లోని సామగ్రి పూర్తిగా కాలిపోవడంతోపాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భవనంతోపాటు ఇతర భవనాలకు దట్టమైన పొగ వ్యాపించింది.
దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులుతీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మండలంలోని ఓ పరిశ్రమకు చెందిన అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను ఆర్పివేశాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ లక్ష్మారెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినలు బాధితుడు తెలిపాడు.