మోత్కూరు , జూన్ 16: ఈ ఏడాది వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. రోహిణి, మృగశిర కార్తెల్లో విస్తారంగా వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. దుక్కులు దున్నడం, విత్తనాలు విత్తడం పనుల్లో రైతులు బిజీ బీజీగా మారారు. ఇప్పటికే రెండు రోజులుగా కురిసిన వర్షాలు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. విత్తనం విత్తుకోవటానికి మృగశిరకార్తె అనువైనది. దీంతో రైతులు విత్తనాలు విస్తారంగా విత్తుతున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు విత్తనాలు విత్తే పనుల్లో నిమగ్నమయ్యారు. కొంత మంది రైతులు దుక్కులు దున్ని చదును చేస్తున్నారు.
పత్తి సాగుపై రైతుల ఆసక్తి…
తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో బిజీ అయిన రైతులు ఇప్పటికే తమకు అవసరమైన విత్తనాలు కొనుగోలు చేశారు. మోత్కూరు మండలంలోని పాటిమట్ల, కొండగడప, దాచారం, దత్తప్పగూడెం, బుజిలాపురం, అనాజిపురం, మోత్కూరు, అడ్డగూడూరు మండలంలోని ధర్మారం, లక్ష్మీదేవికాల్వ, గట్టుసింగారం, మానాయికుంట, చౌళ్లరామారం, కోటమర్తి, చిర్రగూడూరు, కంచనపల్లి గ్రామాల్లో రైతులు సాగువైపు దృష్టి సారించారు. గతేడాది పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటలు కంది, పెసర, ఆముదం వంటి సంప్రదాయ పంటలు సాగుచేశారు. పత్తికి దీటుగా ఈ సారి కందికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో రైతులు కంది సాగు వైపు దృష్టి మళ్లించారు. చాలా మంది రైతులు పత్తితో పాటు కంది, పెసర విత్తనాలు విత్తుకుంటున్నారు.
అందుబాటులో విత్తనాలు
పంటల సాగుకు అనువైన విధంగా వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్లోని అన్ని లైసెన్స్డ్ ఫెస్టిసైడ్, ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. రైతులు ఎమ్మార్పీకే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. క్యూ ఆర్ కోడ్ను స్కానింగ్ చేసి సరుకులు కొనుగోలు చేసి వ్యాపారి వద్ద తప్పకుండా రశీదులు పొందాలి. నకిలీ, నాసిరకం ఎరువులు, విత్తనాలకు ఆస్కారం లేదు. అనుమానం వస్తే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయాలి.
-కె. స్వప్న, మండల వ్యవసాయాధికారి, మోత్కూరు