వికారాబాద్, జూన్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఓ శక్తిగా ఎదగాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే సాధించలేనిదేమీలేదన్నారు. సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమేనన్నారు. చట్ట సభల్లో 50 శాతం అవకాశం రావాలన్నారు. ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్లాలని ఆమె సూచించారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడంపై శ్రద్ధ చూపాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో నార్మల్ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. చదువు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మహిళలు రాణించి ఇతరులకు మార్గదర్శకంగా నిలువాలని సూచించారు. మహిళలకు ఎలాంటి సహకారం కావాలన్నా తాము సిద్ధంగా ఉంటామని సునీతారెడ్డి పేర్కొన్నారు.
మహిళలకు పెద్దపీట
ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేయించుకున్న మహిళలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నదన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు అందజేస్తున్నదని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డలకు లబ్ధి చేకూరుతున్నదన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందడంతో మహిళల కష్టాలు తీరాయని పేర్కొన్నారు. అన్ని శాఖల్లో మహిళలకు తగిన గుర్తింపు ఇవ్వడం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రతి పథకాన్ని అందిపుచ్చుకోవాలి
జిల్లా మహిళా, శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ అధికారి లలితాకుమారి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 3200 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారన్నారు. బాలింతలకు ప్రభుత్వం 200 ఎంఎల్ పాలు, రోజుకు ఒక గుడ్డు, పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. గృహహింస బాధితులకు భరోసా కల్పిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో 140 మందికి గ్రేడ్ సూపర్వైజర్లుగా పదోన్నతులు రాగా, జిల్లాలో 11 మంది ఉన్నారన్నారు. అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం గుర్తించి వారికి జీతాలు కూడా పెంచిందన్నారు. బాలరక్షా భవన్, సురక్షా భవన్ కింద చిన్నారులను చేరదీసి వారి ఆలనాపాలన చూసుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని అర్హులైన మహిళలు అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. అనంతరం స్త్రీ నిధి, మహిళా సమాఖ్య సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలు, ఫ్యాన్లు అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, ఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీలు చంద్రకళ, విజయలక్ష్మి, ధారూరు జడ్పీటీసీ సుజాత, కౌన్సిలర్ పుష్పలతారెడ్డి, మోమిన్పేట ఎంపీడీవో శైలజారెడ్డి, సీడీపీవో వెంకటేశ్వరమ్మ, సీఐ శ్రీను, ఎస్సై సుస్మిత, ఎంపీడీవో సత్తయ్య, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.