కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం రంగారెడ్డి జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చింది. 18 ఏండ్లు నిండిన 66,359 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేయనున్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 33,56,056 మంది ఉండగా అందులో 19-39 ఏండ్ల మధ్య ఉన్న ఓటర్లు 16,70,492 మంది ఉన్నారు. సగం మంది యువ ఓటర్లే ఉన్నారు. వారి ఓటు అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నది. కాగా జిల్లాలో కొత్త ఓటర్లు.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 9,174 మంది, ఎల్బీనగర్లో 8,566 మంది, మహేశ్వరంలో 9,863 మంది, రాజేంద్రనగర్లో 10,488 మంది, శేరిలింగంపల్లిలో 8,663 మంది, చేవెళ్లలో 6,413 మంది, కల్వకుర్తి లో 6,708 మంది, షాద్నగర్ నియోజకవర్గంలో 6,484 మంది ఉన్నారు.
-రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : యువత ఓటే శాసనంగా మారబోతున్నది. అభ్యర్థుల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతున్నాయి. రంగారెడ్డి జిల్లా తుది ఓటర్ల జాబితాను వయస్సుల వారీగా పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి.
జిల్లా మొత్తం ఓటర్లు 33,56,056 మంది ఉండగా.. అందులో 19-39 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న ఓటర్లు 16,70,492 మంది ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువ ఓటర్లు 66,359 మంది ఉన్నారు. వెరసి.. రాబోవు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక శక్తిగా జిల్లాకు చెందిన యువత నిలువబోతున్నది.
కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం జిల్లాలో ఫలించింది. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కళాశాలలు, కోచింగ్ సెంటర్లు తదితర వాటిల్లో ప్రచారం నిర్వహించారు. మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం చేశారు. కొన్నిచోట్ల రాజకీయ పార్టీల నేతలు దగ్గరుండి కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ క్రమంలోనే జిల్లాలో 66,359 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటెయ్యబోతున్నారు. నియోజకవర్గాలవారీగా కొత్త ఓటర్ల వివరాలను పరిశీలిస్తే.. ఇబ్రహీంపట్నంలో 9,174., ఎల్బీనగర్లో 8,566., మహేశ్వరంలో 9,863., రాజేంద్రనగర్లో 10,488., శేరిలింగంపల్లిలో 8,663., చేవెళ్లలో 6,413., కల్వకుర్తిలో 6,708., షాద్నగర్లో 6,484 మంది ఉన్నారు.
జిల్లాలో వందేండ్లు పైబడిన వారు 532 మంది ఉన్నట్లు తుది ఓటరు జాబితా స్పష్టం చేస్తున్నది. 100 నుంచి 109 ఏండ్లు వయసుగల ఓటర్లు 371 మంది ఉండగా.. 110 నుంచి 119 ఏండ్లున్న వారు ఆరుగురు మాత్రమే ఉన్నారు. 120 ఏండ్లు పైబడిన వారు 155 మంది ఉన్నారు.