షాబాద్ : తలనొప్పి బాధ భరించలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన మల్లగళ్ల బాలకృష్ణమూర్తికి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అందులో రెండో కూతురు స్వర్ణలత(16) వికారాబాద్లో బంధువుల వద్ద ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. ఈ నెల 18న షాబాద్లోని వాళ్ల ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉన్న తన చెల్లితో నాకు తలనొప్పిగా ఉందని, నన్ను విసిగించకని గదిలోకి వెళ్లి తలుపుపెట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత చెల్లెలు తలుపు కొట్టి చూడగా లోపలి నుంచి గడియ పెట్టుకుంది.
దువ్వెన సహాయంతో గది తలుపు గడియ తీసి లోపలికి వెళ్లి చూడగా స్వర్ణలత ఇంట్లో దులానికి చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు కొద్దిరోజులుగా తలనొప్పితో బాధపడుతుండేదని, తలనోప్పి భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.