మంచాల, ఏప్రిల్ 28 : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బోడకొండతోపాటు దానికి అనుబంధంగా ఉన్న లోయపల్లిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 20 రోజుల కిందట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడికి రైతులు తీసుకెళ్లిన వరి ధాన్యాన్ని వెంటనే తూకం వేయకుండా తాలు, తేమ శాతం ఉందని చెప్పి నిర్వాహకులు కొనడంలేదు. దీంతో అన్నదాతలు ధాన్యాన్ని అక్కడే ఉన్న స్థలంలో ఉంచడంతో కుప్పలుగా పేరుకుపోతున్నది.
అంతేకాకుండా మౌలిక వసతులు కల్పించక.. గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం తో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ధాన్యాన్ని 50 కిలోల చొప్పున బస్తాల్లో నింపి తూకం చేసి లారీల్లో లోడ్ చేసి.. రైస్మిల్లులకు తరలించిన తర్వాత తూకం 48 కిలోలకే వచ్చిందని.. అందువల్ల ఆ మొత్తానికే డబ్బులు చెల్లిస్తామని అధికారులు చెబుతుండడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి తూకం చేసిన 50 కిలోలకే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులను అడిగితే ఎండలతో బస్తాల్లోని వడ్లు ఎండి వాటి బరువు తగ్గుతున్నదని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనడంతోపాటు తూకం వేసి సంచుల్లో నింపిన మొత్తానికి డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. కాగా లోయపల్లి గ్రామంలో కొంతమంది రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురాకుండా పొలాల్లోనే వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.