యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా పుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్వర్ణతాపడం నిర్మాణానికి రూ. 11,00,000 విరాళం సమర్పించారు. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సుబ్రమణ్యం గురువారం యాదాద్రిలో ఆలయ ఈవో ఎన్. గీతకు చెక్కును అందజేశారు.
స్వర్ణతాపడం విరాళాల భక్తులకు ప్రత్యేక సదుపాయాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాలు అందజేసే భక్తులకు ఆలయ ఈవో గీత గురువారం శుభవార్త తెలిపారు. విరాళాలు అందజేసేవారికి డోనర్ ఐడీ కార్డులు అందజేయనున్నామని అన్నారు. వీరికి ఏడాదికి రెండుసార్లు ఉచిత దర్శనానికి అనుమతినిస్తామని అన్నారు. రూ. 5లక్షలకు పైగా విరాళాలు అందజేసిన భక్తులు స్వామివారి ఉచిత వీఐపీ దర్శనం, తీర్థప్రసాదం అందజేస్తామన్నారు. రూ. 5లక్షల నుంచి రూ. 25లక్షలలోపు విరాళాలు అందజేసిన దాతలకు వీఐపీ దర్శనంతో పాటు స్వామివారి ప్రసాదం, కండువాను అందజేస్తామన్నారు.
రూ. 25లక్షల నుంచి రూ. కోటి అందజేసిన దాతలకు కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనం, స్వామివారి వేద ఆశీర్వచనం, లడ్డూ ప్రసాద వితరణ, సువర్ణపుష్పార్చన సేవలకు అనుమతినిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు వారితో వచ్చే మిగతా భక్తులకు వీఐపీ టికెట్టు తీసుకుని స్వామివారిని దర్శంచుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని దాతలు సద్వినియోగించుకోవాలని ఆలయ ఈవో విజ్ఞప్తి చేశారు.