బషీరాబాద్, మార్చి 10 : యువకుల కేరింతల నడుమ కుస్తీ పోటీలు అట్టహాసంగా సాగాయి. మావోడు గెలుస్తాడంటే… లేదు లేదు మావోడే తప్పక గెలుస్తాడంటూ… కుస్తీ పోటీలు సాగాయి. మహాశివరాత్రి జాతరలో భాగంగా బషీరాబాద్ మండలం జీవన్గి మహాదేవలింగేశ్వరాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఆదివారం ఎంతో సరదాగా, ఉత్కంఠగా కొనసాగాయి. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి పోటీదారులు వచ్చారు. మూడు రాష్ర్టాల నుంచి వచ్చిన యువకులు నేనంటే నేను అన్నట్లుగా పోటాపోటీ పడ్డారు. దాదాపు కొన్ని గంటల పాటు ఎంతో ఉత్కంఠగా జరిగిన పోటీల్లో చివరకు కర్ణాటకకు చెందిన యువకుడు విజేతగా నిలిచాడు.
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జీవన్గి గ్రామంలో వెలసిన మహాదేవలింగేశ్వరాలయంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. పోటీల్లో పాల్గొనేందుకు కర్ణాటక రాష్ట్రం బీదర్, సేడం, చించోళి, అడ్కి, కురుగుంట, గుల్బార్గా, సులేపేట్, ఇర్గుపల్లి, కర్షికాలం, కర్కిముకిలి, మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్, దేవ్ని తదితర ప్రాంతాలతో పాటు బషీరాబాద్ మండలం కొర్విచెడ్, ఇందర్చెడ్, బషీరాబాద్, క్యాద్గీరా, జీవన్గి, తదితర గ్రామాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యహ్నం 2 గంటల వరకు పోటీలు ఆసక్తికరంగా జరిగాయి.
పోటీలను తిలకించేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. టెంకాయతో ప్రారంభమైన కుస్తీ పోటీలు వెండి కడియంతో ముగిశాయి. చిన్నవారు చిన్న వారితో పెద్ద వారు పెద్దవారితో విడివిడిగా కుస్తీపట్లు పడ్డారు. చివరి పోటీల్లో కర్ణాటక రాష్ర్టానికి చెందిన శ్రీకాంత్ కంబ్లె, మహేశ్ పోటీ పడగా, శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. విజేతను కుస్తీ పడిన ప్రదేశం నుంచి ఆలయం వరకు భుజాలపై ఎత్తుకుని జై కొడుతూ తీసుకొచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి కడియంను బహుమతిగా ఇచ్చి ఘనంగా సన్మానించారు. పోలీసుల తరఫున తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సీఐ అశోక్ విజేతను సన్మానించారు. ఉత్సవాలను ఆలయ కమిటీ నిర్వహించగా, ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
మహాదేవలింగేశ్వర జాతర సందర్భంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న కలశం వేలం పాట ఆదివారం నిర్వహించారు. మేడ్చల్ పట్టణానికి చెందిన భీమ్రెడ్డి రూ. 85,101లకు కలశాన్ని దక్కించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయ పూజరులు, ఆలయ కమిటీ ప్రతినిధులు కలశాన్ని అప్పగించారు.
అంగరంగ వైభవంగా జరిగిన జాతర ఆదివారంతో ముగిసింది. అశేష భక్తజనానికి ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది.