రంగారెడ్డి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పురిటి బిడ్డ నుంచి పండు ముసలోళ్ల వరకు సంక్షేమ ఫలాలను అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మి, వీ-హబ్, కేసీఆర్ కిట్, షీటీమ్స్, షీ క్యాబ్స్ వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారు. ఊతం లేని బతుకులకు చేయూతనిచ్చి సగౌరవంగా బతికేలా భరోసాను కల్పిస్తున్నారు. మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ అంగన్వాడీలా ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆడబిడ్డల రక్షణ కోసం షీటీంలను ఏర్పాటు చేశారు.
మహిళలు ఆర్థికంగా రాణించాలనే ఉద్దేశంతో షీ క్యాబ్స్, ఎస్హెచ్జీలకు రుణాలు మంజూరు చేస్తూ స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లతో ఆసరా, గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.వందల కోట్లను ఖర్చు చేసింది.
రాష్ట్ర సాధన ఉద్యమంలో కదం తొక్కిన మహిళల సంక్షేమానికి స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారు. స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తూ వినూత్న రీతిలో సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి, వీ-హబ్, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు మహిళల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశాయి. ఊతం లేని బతుకులకు సంక్షేమ పథకాలు చేయూతనిచ్చి సగౌరవంగా బతికేలా భరోసాను కల్పిస్తున్నాయి.
కన్నీళ్లు తుడిచిన కల్యాణలక్ష్మి
పేదింటి కుటుంబాలు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఆర్థికంగా సతమతమయ్యేవి. ఖర్చులు భరించలేక అప్పులపాలయ్యేవి. ఆడపిల్ల అంటేనే భారమనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. ఈ దుస్థితిని దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆడపిల్లల పెళ్లికి పెద్దన్నలా మారారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచారు. జిల్లాలో 2022-23లోనే కల్యాణలక్ష్మి ద్వారా 7,469 మందికి రూ.74.77కోట్లను, షాదీముబారక్ ద్వారా 3,0467 మందికి రూ.34.71కోట్ల సాయాన్ని అందించి సర్కారు అండగా నిలిచింది.
ఆర్థిక స్వావలంబనకు రూ.3,558 కోట్ల రుణాలు
వివిధ వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించి ఆదాయ వనరుల పెంపే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు బ్యాంకుల ద్వారా ఇతోధికంగా బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి ద్వారా రుణాలను అందజేస్తున్నది. జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 19,192 ఉండగా 2,06,715 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వివిధ యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు లింకేజ్ ద్వారా గత తొమ్మిదేండ్ల కాలంలో ప్రభుత్వం రూ.3,588 కోట్ల రుణాలను అందజేసింది. ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో మహిళలు వివిధ రకాల యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాదిలో బ్యాంకు లింకేజ్ ద్వారా రూ.710 కోట్లు, స్త్రీ నిధి ద్వారా రూ.112 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణను మొదలుపెట్టింది. వీ హబ్ ద్వారా పరిశ్రమల స్థాపనకు రుణాలను అందించి మహిళా పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది.
ఆధారంలేని బతుకులకు భరోసా..
ఆసరా పథకం ఆధారంలేని బతుకులకు భరోసానిస్తున్నది. 2014లో పురుడు పోసుకున్న ఈ పథకంలో నేడు రూ.2,016 ఆర్థిక సాయం నెలవారీగా అందుతున్నది. జిల్లాలో 2,03,500 మందికి పెన్షన్ కింద ప్రభుత్వం నెలనెలా రూ.51కోట్లను వెచ్చిస్తున్నది. రెక్కాడితేనే డొక్కాడని పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ రోగుల పాలిట సీఎం కేసీఆర్ పెద్ద కొడుకుగా అండగా నిలిచారు. ఇందులో అధిక భాగం మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు అర్హులకు దక్కే సాయం అంతంత మాత్రంగానే ఉండేది. అనేక మందికి సాయం అందేదే కాదు. స్వరాష్ట్రంలో ఎంతోమంది వితంతువులు, దివ్యాంగులు, వృద్ధ స్త్రీలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఈ పథకం వరంగా మారింది.
మహిళా ఉద్యోగులకు బాసట
స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యోగ వర్గాలు ఉద్యోగ భద్రత, వేతనాల కోసం ధర్నాలు, నిరసనలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ భద్రత కోసం అనేక నిర్ణయాలు తీసుకుని మహిళా ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారు. గతంలో వేతన పెంపుపై అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు గౌరవ వేతనం అందుకుంటున్న చిరుద్యోగులందరికీ వేతనాలు పెంచారు.
ఫలితంగా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు, ఆశా వర్కర్లతోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 30 శాతం మేర గౌరవ వేతనాలను ప్రభుత్వం పెంచింది. ఏడేండ్లలో మూడు రెట్ల కంటే అధికంగా టీచర్లకు 325 శాతం, మినీ అంగన్వాడి టీచర్లు, ఆయాలకు మూడున్నర రెట్లు అంటే 354 శాతం పెరిగింది. రంగారెడ్డి జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,380 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 220 వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో అంగన్వాడి కేంద్రంలో ఒక టీచర్, హెల్పర్ చొప్పున జిల్లావ్యాప్తంగా 1,560 మంది టీచర్లు, 1,268 మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లు రూ.7,800, హెల్పర్స్ రూ.7,800 వేతనాన్ని అందుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఈ రీతిన అధిక వేతనాలు లేవని మహిళా ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాజకీయంగాను పురుషులతో సమానంగా ఎదగాలన్న సంకల్పంతో ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పించి ప్రోత్సహిస్తున్నది. స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీల్లో మహిళలు పదవులను పొంది రాణిస్తున్నారు. షీ టీమ్స్ బృందాలు మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.
తల్లీబిడ్డలకు కానుకగా కేసీఆర్ కిట్
మాతృత్వం ఒక వరం. స్త్రీల ఆరోగ్యంతోపాటు బిడ్డ ఆరోగ్యం, ఆలనా పాలనా కూడా అంతే అవసరం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కిట్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పువ్వుల్లాంటి బిడ్డలకు కంటికి రెప్పలా కాపాడుకునేలా కిట్లో బిడ్డల సంరక్షణకు కావాల్సిన వస్తువులను అందిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవించిన స్త్రీలకు రూ.12వేల మొత్తాన్ని మూడు విడతల్లో అందిస్తున్నారు. ఆడబిడ్డ పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలను ఇస్తున్నారు. గడచిన తొమ్మిదేండ్లలో 2,40,603 మంది గర్భిణులకు రూ.67.96 లక్షలను కేసీఆర్ కిట్ కింద అందజేశారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నదో తెలియజెప్పడానికి ఈ ఒక్క పథకమే నిదర్శనం. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, ఉడికించిన గుడ్లను అందిస్తూ గర్భిణులు, పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది.
ఆడపడుచులకు అన్నలా.. చిన్నారులకు మేనమేమలా..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడచులకు అన్నలా.. చిన్నారులకు మేనమామలా ఆదరిస్తున్నారు. ముందు సర్కారు దవాఖానల్లో కాన్పులు చేసుకోవాలంటే భయంగా ఉండేది. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాత సర్కారు దవాఖానలు చాలా మంచిగైనయి. అందుకనే మాలాంటి వాళ్లు చాలా మంది సర్కారు దవాఖానలో భరోసాతో ఆరోగ్య పరీక్షలు చేసుకుంటున్నాం. రెండు కాన్పులు సర్కారు దవాఖానల్లోనే చేయించుకున్నా. డాక్టర్లు మంచిగా చూసుకున్నరు. ప్రైవేట్ దవాఖానలో చూపించుకోవాలంటే ఎక్కువ పైసలు కావాలి. ప్రైవేటు ఆసుపత్రి మాదిరిగా సర్కారు ఆసుపత్రిలో గర్భిణి నుంచి పాప పుట్టే వరకు అన్ని పరీక్షలు చేస్తూ మంచిగ చూశారు. పురుడు పోసుకోవడానికి ఆసుపత్రికి ఇంటి నుంచి అమ్మ ఒడి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి కాన్పు తరువాత తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేరుస్తున్నారు. కేసీఆర్ కిట్లను అందించారు. అందులో బిడ్డకు కావాల్సిన అన్ని రకాల వస్తువులున్నాయి. వాటిని మాలాంటి వాళ్లు కొనలేము. కేసీఆర్ సారు మేనమామగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి వస్తువులను అందించడం చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేలు అందించి ఆరోగ్యానికి ఆసరా అందిస్తున్నారు. మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
– సుగుణ, హస్నాబాద్. కొడంగల్
ఉచితంగా అన్ని రకాల పరీక్షలు
నేను వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కుటుంబ పోషణలో మహిళలదే కీలక పాత్ర. ఇంటి పనితో పాటు పొలం పనులు చేస్తున్న మహిళలకు అనేక చిన్న చిన్న వ్యాధులు వస్తుంటాయి. వాటిని నయం చేసుకోవాలంటే ప్రైవేటు దవాఖానలకు వెళ్లాల్సి వచ్చేది. స్కానింగ్లు, ఎక్స్రేలు, వివిధ రకాల పరీక్షలు చేయాలంటే వేలకు వేలు ఖర్చయ్యేవి. గతంలో ఏ ఒక్క ప్రభుత్వమూ మహిళల ఆరోగ్యం కోసం ఆలోచన చేయదు. మొదటి సారిగా మహిళల కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ అనే ఓ మంచి పథకాన్ని తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఈ పథకం వర్తిస్తుంది. రామయ్యగూడ పీహెచ్సీలో ప్రత్యేకంగా మహిళా డాక్టర్లతో 11 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా చూస్తున్నారని ఆశావర్కర్ల ద్వారా తెలుసుకున్నాను. ఉచితంగా వైద్యులను సంప్రదించడంతోపాటు అవసరమైన మందులు మాత్రలు అందజేశారు. వివిధ రకాల పరీక్షల కోసం పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీ సమీపంలోని రేడియాలజీ హబ్ ద్వారా ఉచితంగా స్కానింగ్, ఎక్స్రే తదితర పరీక్షలు చేసి రిపోర్ట్లను 24 గంటల్లోనే రోగులకు అందిసున్నారు. ఎలాంటి రోగాలు ఉన్నా వెంటనే మహిళా వైద్యులను సంప్రదించి పలు సూచనలు, సలహాలు పాటించి ఆరోగ్యాలను కాపాడుకుంటున్నాం. ఇంటి పని, పొలం పనులతో నిత్యం బిజీగా ఉండే మాలాంటి వారి కోసం ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. గతంలో పరీక్షలు చేయించుకోవాలంటే హైదరాబాద్, ప్రైవేటు దవాఖాలకు వెళ్లాల్సి వచ్చేది. ఎంతో ఖర్చయ్యేది. ప్రభుత్వం మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో సమస్యలు పరిష్కరించుకోగలుగుతున్నాం. ఎలాంటి సమస్యలున్నా డాక్టర్లు పరిష్కరిస్తున్నారు.
– లలిత, ధన్నారం, వికారాబాద్
మహిళాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి
స్త్రీ నిధి రుణాలతో మాకు ఎంతగానో ఆర్థికంగా ఉపయోగపడింది. గతంలో చాలా తక్కువ మొత్తంలో రుణాలు అందజేసేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం మహిళలకు అనేక స్కీములు ఏర్పాటు చేసి వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు. నేను స్త్రీ నిధిలో భాగంగా రూ.70 వేల వరకు రుణం పొందాను. ఏ ప్రభుత్వాలూ ఇంతగా మహిళల అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మహిళలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఇలాంటి ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకోవాలి. మాకు ఆర్థిక తోడ్పాటు అందించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– పార్వతి, విఘ్నేశ్వర మహిళా సంఘం అధ్యక్షురాలు, అంతారం, చేవెళ్ల
కేసీఆర్ కిట్తో పేద మహిళలకు ఎంతో మేలు
సీఎం కేసీఆర్ కిట్ బాలింతల కోసం పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. గత ప్రభుత్వాలు మహిళలను ఏ మాత్రమూ పట్టించుకోలేదు. పేదింటి మహిళలు పురుడు పోసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు. వారి కష్టాలను ఎరిగిన ప్రభుత్వం వారి ప్రసవాలు సుఖంగా జరిగేలా ఏర్పాట్లు చేసింది. ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్టుతో పాటు ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు అందిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు, గర్భిణులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, పేదింటి మనసులను ఎరిగిన నాయకుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. మహిళలకు సముచిత గౌరవం కల్పించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. అటువంటి గొప్ప నాయకుడు మరోసారి అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఎంతో న్యాయం జరుగుతుంది. పేదింటి మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ ప్రసవించే వరకు ఖర్చులు ఇవ్వడంతో పాటు కేసీఆర్ కిట్ను అందించడం అభినందనీయం.
– మరియమ్మ, బాలింత, చేవెళ్ల
బ్యాంకు రుణాలు తీసుకుని ఆర్థికంగా ఎదిగా
మహిళా సంఘంలో చేరక ముందు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాళ్లం. పంటలు పండించడానికి అప్పు చేసేవాళ్లం. ఒక్కోసారి పంటలు నష్టపోయి అప్పులపాలయ్యేవాళ్లం. కౌలుకు తీసుకున్న భూమిలో పంటలు సాగు చేసినా లాభాలు రాకపోవడంతో వ్యవసాయ కూలీగా పని చేసేదాన్ని. సంఘంలో చేరడానికి 12 ఏండ్ల క్రితం అవకాశం వచ్చింది. గ్రూప్లో చేరిన తరువాత బ్యాంక్ రుణాలు, స్త్రీ నిధి రుణాలను తీసుకోవడం ప్రారంభించాను. రుణాలు తీసుకుని వ్యాపారం కోసం వాడుకున్నాను. బట్టల దుకాణం పెట్టడంతో లాభాలు పొందుతున్నాం. ప్రతి నెల రూ.25 వేల నుంచి 30 వేలు సంపాదిస్తున్నాం. పిల్లలను మంచిగా చదివించాను. ఇప్పటివరకు రూ.18 లక్షల రుణాలు తీసుకుని వ్యాపారం కోసం వాడుకుని తిరిగి అప్పులు చెల్లించాను. ప్రభుత్వం కూడా మహిళా సంఘాలకు మంచిగా రుణాలు ఇచ్చింది. సంఘం ఆర్థిక లావాదేవీలను బట్టి బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇచ్చారు. సంఘంలో చేరిన తరువాతనే ఆర్థికంగా మా కుటుంబం అభివృద్ధి చెందింది.
– గున్నాల లక్ష్మి, చిలుకూరు, మొయినాబాద్
అప్పుడా మాటే లేదు.. ఇప్పుడిచ్చిండ్రు
అప్పట్ల సర్కారోళ్లు ఇట్లాంటివి ఏమీ ఇయ్యలేదు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ గవర్నమెంట్ గర్భిణులు, బాలింతలకు శానా మంచి పనులు చేస్తున్నది. ముందుగాల ఆశా కార్యకర్తలొచ్చి పాప పుట్టేకంటే నెల ముందొచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండ్రు. బాదాం, ఖర్జూర ఇట్ల ఇంకొన్ని ఇచ్చిండ్రు. మంచిగ అనిపించింది. పాప పుట్టంగనే దవాఖానలనే కేసీఆర్ కిట్ చేతుల పెట్టిండ్రు. పిల్లను ఎత్తుకోనికె, మచ్చర్దానిలెక్క పనికొచ్చే పరుపు ఇచ్చిండ్రు. పసికందు కోసం ఆయిల్, సబ్బులు, షాంపూలు కూడా దాంట్ల ఉన్నయి. ఇవన్నీ పిల్లకు మంచిగ ఉపయోగపడుతయి. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది. దాదాపు 10 ఏండ్ల కిందట నా పెద్ద కొడుకు పుట్టినప్పుడు అప్పటి సర్కారోళ్లు ఇట్లాంటివి ఏమీ ఇయ్యలే. ఇట్లాంటివి ఇస్తే పేదోళ్లకు ఆసరా అయితది.
– రాసునూరి శైలజ, తట్టిఅన్నారం, పెద్దఅంబర్పేట