వికారాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టి ఏటా లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేస్తున్నది. సంఘాలవారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతోపాటు స్వల్ప వడ్డీతో కూడిన రుణాలను మంజూరు చేస్తున్నది. మహిళా సంఘాల సభ్యులు అధికంగా కిరాణా దుకాణాలను నిర్వహించేందుకు, గేదెలు, గొర్రెలు, మేకలను కొనుగోలు చేయడం, కూరగాయల వ్యాపారం తదితర ఉపాధిని ఏర్పాటు చేసుకునేందుకుగాను రుణాలను తీసుకుంటున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు గత ఆర్థిక సంవత్సరానికి మించి రుణాలను మంజూరు చేసేందుకు నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలకు సంబంధించి రూ.596 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో బ్యాంకు లింకేజీ కింద రూ.554 కోట్ల రుణాలు, స్త్రీనిధి కింద రూ.42 కోట్ల రుణాలను మంజూరు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి పథకం కింద మంజూరు చేసే రుణాలకు సంబంధించి రూ.134 కోట్ల రుణాలను అదనంగా పెంచుతూ నిర్ణయించారు. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 657 గ్రామసంఘాలుండగా, 10,375 స్వయం సహాయక సంఘాలు, 1.80 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు.
అంతేకాకుండా ఎప్పటికప్పుడు రుణాలను చెల్లించి తిరిగి రుణాలు పొందుతూ రెగ్యులర్గా ఉన్న స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పాటునందిస్తున్నారు. అయితే ఒక్కో స్వయం సహాయక సంఘానికీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా ఎస్హెచ్జీలు వృద్ధి చెందడంలో చేయూతనందిస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి పలు సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.20 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నారు.
జిల్లాలో ఏటా మహిళా స్వయం సహాయక సంఘాలకు లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేశారు. జిల్లావ్యాప్తంగా 8794 స్వయం సహాయక సంఘాలకు రూ.462.67 కోట్ల రుణాలను మంజూరు చేశారు. మోమిన్పేట మండలంలో 35.69 కోట్లు, యాలాల మండలంలో రూ.27.81 కోట్లు, బషీరాబాద్ మండలంలో రూ.29.52 కోట్లు, తాండూరు మండలంలో రూ.29.13 కోట్లు, దోమ మండలంలో రూ.29.85 కోట్లు,
కులకచర్ల మండలంలో 37.02 కోట్లు, నవాబుపేట మండలంలో 29.57 కోట్లు, పరిగి మండలంలో 25.01 కోట్లు, బంట్వారం మండలంలో రూ.15.67 కోట్లు, చౌడాపూర్లో రూ.4.63 కోట్లు, ధారూరు మండలంలో 18.88 కోట్లు, మర్పల్లి మండలంలో రూ.26.70 కోట్లు, పెద్దేముల్ మండలంలో 30.79 కోట్లు, పూడూరు మండలంలో రూ.21.18 కోట్లు, వికారాబాద్ మండలంలో 16.53 కోట్లు, దౌల్తాబాద్ మండలంలో రూ.20.82 కోట్లు, కొడంగల్ మండలంలో రూ.20.66 కోట్లు, బొంరాసుపేట్ మండలంలో 26.19 కోట్ల రుణాలను మంజూరు చేశారు.
మరోవైపు జిల్లావ్యాప్తంగా ఎన్పీఏ(పనిచేయని సంఘాలు)లపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మొండికేసిన సంఘాలపై దృష్టి పెట్టి సంఘాలవారీగా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా రుణాలు తిరిగి చెల్లించడంలో మొండికేసిన సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను కూడా నిలిపివేశారు. అదేవిధంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామీణ మహిళలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారు.
అయితే జిల్లాలోని ప్రతి గ్రామంలోని స్వయం సహాయక సంఘాల్లో ఆసక్తిగల వారిలో ముగ్గురి చొప్పున ఎంపిక చేసి, వారికి స్వయం ఉపాధి కల్పనలో కొత్త, కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అవసరమైన నైపుణ్యాలు, ఆర్థిక వనరులను కల్పించి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమాన్ని యంత్రాంగం అమలు చేస్తుంది. అయితే ఇప్పటివరకు 3 వేల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారులుగా మారారు.
ఎస్హెచ్జీలు ఉత్పత్తి సంబంధిత వ్యాపారాలతోపాటు వాణిజ్య, వర్తక వ్యాపారాలు, సేవా పరమైన వ్యాపారాలను ప్రారంభించారు. సంబంధిత 3 వేల మందికి వ్యాపారాలను నిర్వహించుకునేందుకుగాను బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, గ్రామసంఘం నిధుల ద్వారా సుమారు రూ.40 కోట్ల రుణాల వరకు అందజేశారు. విలేజ్ ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా ఎంపికైన సభ్యులకు ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను మంజూరు చేశారు.