రంగారెడ్డి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల జయపజయాలను వారే నిర్ణయించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. వీటిలో వికారాబాద్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. చేవెళ్ల, పరిగి సెగ్మెంట్లలో పురుషులు, స్త్రీ ఓటర్ల మధ్య వ్యత్యాసం వెయ్యి లోపే ఉన్నది. మిగతా మూడు చోట్ల కూడా అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థితిలో అతివలు ఉన్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్తగా ఓటు నమోదుకు అవకాశం కల్పించింది. ఫామ్-6 ద్వారా రంగారెడ్డి జిల్లాలో 53,216 మంది కొత్తగా ఓటు హక్కును పొందారు. ఇందులోనూ ఎక్కువగా మహిళలే ఓటర్లుగా నమోదు కావడం విశేషం. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులు 25,168 మంది ఉండగా.. మహిళలు 28,042 మంది ఉన్నారు. జిల్లాకు అనుబంధంగా ఐదు పార్లమెంట్ స్థానాలుండగా..అన్నింట్లోనూ మహిళా ఓట్లే కీలకం కానున్నాయి.
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. వారిని మెప్పించగలిగితే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని నాయకులు భావిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల జాబితాలను జల్లెడ పడుతున్నారు. కుల, యువజన సంఘాలు, ద్వితీయ శ్రేణి, మండల, గ్రామ స్థాయి నాయకులతోపాటు మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకునే దిశగా వ్యూహాలు పన్నుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లే అభ్యర్థుల విజయవకాశాలపై ప్రభావాన్ని చూపడంతో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలను మొదలెట్టాయి.
కేసీఆర్ హయాంలో మహిళల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు దోహదపడతాయని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లపై పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. పదేండ్ల కాలంలో వివిధ పథకాల ద్వారా అతివలకు చేకూర్చిన లబ్ధిని ఇంటింటికీ తిరిగి మహిళలకు వివరించి..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. బీసీ నినాదంతోపాటు మహిళా నినాదాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా ప్రచారం చేస్తున్నారు.