తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సుపరిపాలన కొనసాగుతున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఆదర్శ పాలన అందుతుండడంతో దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్నది. త్వరితగతిన పరిపాలనా విభాగాల పునర్విభజనను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్కు ముందు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాలు మాత్రమే ఉండేవి. ప్రజలు జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు పోవాలంటే 200 నుంచి 250 కిలో మీటర్ల దూరం పోవాల్సి వచ్చేది. జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా ఇబ్బందులు పడేటోళ్లు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చట్టం – 1974 ప్రకారం, మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలను ప్రారంభించుకున్నాం. గతంలో పది జిల్లాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం నేడు 33 జిల్లాలతో సమర్ధవంతమైన పాలన కొనసాగుతున్నది.
– రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ)
జిల్లా కేంద్రాలు ప్రజల అవసరాలకు అనుకూలంగా, అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ శాఖలన్నింటిలో నూతన విభాగాలను ఆ జిల్లాలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలు గంట సేపట్లోనే జిల్లా కార్యాలయానికి వెళ్లే అవకాశం కలిగింది. స్థానిక పరిస్థితులు, వనరులు, ప్రత్యేకతలు, ప్రజల అవసరాలు, సామాజిక స్థితిగతులపై అధికారులకు పూర్తి అవగాహన కలుగుతున్నది. స్థానిక వనరులను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, వాటి పర్యవేక్షణ నేడు జిల్లా అధికారులకు సులభతరం అవుతున్నది. పోలీసు స్టేషన్ల పరిధి తగ్గడం వల్ల నేర నియంత్రణ, నేర పరిశోధన సులువైంది.
రాష్ట్రంలో అన్ని జిల్లాల మాదిరిగానే రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజనకు ముందు రంగారెడ్డి జిల్లా 4 డివిజన్లు, 37 మండలాలు, 699 గ్రామ పంచాయతీలతో జిల్లా పరిపాలన కొనసాగుతుండేది. జిల్లాల వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను విభజించి 3 జిల్లాలు ‘రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి’గా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డిలోని 14 మండలాలు, మహబూబ్నగర్లోని 7 మండలాలు, కొత్తగా ఏర్పాటైన 6 మండలాలు (అబ్దుల్లాపూర్మెట్, బాలాపూర్, గండిపేట్, నందిగామ, కడ్తాల్, చౌదర్గూడెం) మొత్తం 27 మండలాలతో కలిపి నూతన రంగారెడ్డి జిల్లాను (11 అక్టోబర్ 2016న) ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను 5 రెవెన్యూ డివిజన్లుగా విభజించడం జరిగింది. ఇందులో రెండు పాత రెవెన్యూ డివిజన్లు (రాజేంద్రనగర్, చేవెళ్ల), కాగా, మూడు నూతనంగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్లు ‘ఇబ్రహీంపట్నం, కందుకూరు, షాద్నగర్’లు. నూతన రంగారెడ్డి జిల్లా ఏర్పాటు నాటికి ఒక మున్సిపాలిటీ, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉండగా, నేడు కొత్తగా 12 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకొని పరిపాలనను పట్టణ ప్రజలకు చేరువలోకి తీసుకురావడం జరిగింది.
రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని అన్ని హంగులతో అధునాతన సదుపాయాలతో కొంగరకలాన్ గ్రామం, ఇబ్రహీంపట్నం మండలంలో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.58 20 లక్షలతో నిర్మాణం చేసుకొని గత సంవత్సరం ఆగస్టు 25న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తమ భూములకు పట్టాలు రాక అలసిపోయిన తెలంగాణ రైతులు స్వయం పాలనలో భూవివాదాలను పరిష్కరించుకొని, భూ హక్కులను వివాదరహితంగా సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ద్వారా ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి, ఎవరి భూమి వాళ్లకే అప్పజెప్పింది. 2017 సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ను విజయవంతంగా నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డులను ప్రక్షాళన చేసి రైతులకు కొత్త పాస్ పుస్తకాలను అందించింది. భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్ను రూపొందించింది. దీనితో ప్రజలకు ప్రయాస లేకుండా సులభతరంగా నిమిషాల వ్యవధిలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ జరుగుతున్నది. రెవెన్యూ శాఖతో కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థను అనుసంధానం చేయడం వల్ల పారదర్శకత పెరిగి అవినీతికి అడ్డుకట్ట వేయడం జరిగింది. జిల్లాలో భూ సంబంధిత లావాదేవీలకు సంబంధించి లక్షా 97 వేల 947 దరఖాస్తులు రాగా, లక్షా 2 వేల 575 దరఖాస్తులను ఆమోదించి, 80 వేల 209 దరఖాస్తులను తిరస్కరించనైనది.