‘ధరణి’ పోర్టల్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్పై రైతు లోకం మండిపడుతున్నది. రైతులకే సర్వ హక్కులు కల్పించిన ‘ధరణి’ని తీసేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ మాకెందుకని రైతాంగం ప్రశ్నిస్తున్నది. ధరణిని ఎత్తేస్తే పటేల్, పట్వారీ వ్యవస్థ వచ్చి దళారులు, పైరవీకారుల రాజ్యం పుట్టుకొస్తదని అంటున్నారు. పైసలు ముట్టజెప్పనిదే ఫైలు ముందుకు కదలని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
ఏండ్లకేండ్లు దుమ్ము పట్టినా సరే ఆ దస్ర్తాన్ని పట్టించుకునే నాథుడు ఉండడని గత ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు. రాత పద్దతి మళ్లీ వచ్చి భూ యజమానులకు తెలియకుండా ఒకరి భూమి మరొకరి పేరుపై బదలాయించడం వంటి అక్రమాలకు ఆస్కారం కలుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
భూ వివాదాలు పెరిగి పచ్చని పైరుతో కళకళలాడుతున్న పల్లెల్లో వైషమ్యాలు పెరిగే ప్రమాదముందని పేర్కొంటున్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలకు సైతం దూరమయ్యే పరిస్థితి వచ్చి రైతుల బతుకులు అగమ్యగోచరంగా మారుతాయని అంటున్నారు. భూ ధరలు సైతం పతనమై గుండె ధైర్యాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కౌలు చట్టం అమలుతో సన్న, చిన్నకారు రైతుల జీవితాలు బుగ్గిపాలవుతాయని అల్లాడిపోతున్నారు.
మొత్తానికి అన్నదాతలు తమ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరణిని రద్దు చేసి దశాబ్దాల కాలంగా భూ సమస్యలతో అరిగోస పెట్టిన పాత రెవిన్యూ వ్యవస్థను మళ్లీ తెస్తామంటున్న కాంగ్రెస్పై జిల్లా రైతాంగం కన్నెర్రజేస్తున్నది. రైతును రాజు చేసిన బీఆర్ఎస్ పక్షాన నిలుస్తామంటూ తేల్చి చెప్తున్నారు. ఇగ కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే మళ్లీ మధ్యవర్తులే బాగు పడతారని, రైతులు ఈ విషయంలో ఆలోచించి ఓటు వేయాలని పలువురు సూచిస్తున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేస్తే రైతులు జీవితాలు ఆగమైతాయి. భూముల లావాదేవీలు దళారులు, కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తాయి. మాయ మాటలు చెప్పి రైతులను ఆగం చేయడానికి కాంగ్రెసోళ్లు సిద్ధం అవుతున్నారు. ప్రజలు వారికి ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయం. ధరణితో భూ లావాదేవీలకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధలు తీరాయి. ఒకేరోజు పనులన్నీ పూర్తయి పాస్బుక్ చేతికి అందుతున్నది. ధరణిని రద్దు చేస్తామనే కాంగ్రెస్ను ఓడించాలి. రైతుల బాగుకోరే నాయకుడు కేసీఆర్కు అండగా ఉండాలి.
– రాములుయాదవ్, రైతు, బ్రహ్మణపల్లి, తుర్కయాంజాల్
ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూ సమస్యలు తీరిపోయాయి. నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతున్నది. ధరణి లేనప్పుడు రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాత్రికి రాత్రే పట్టాదారుల పేర్లను మారుస్తూ అవినీతి అధికారులు సొమ్ము చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయాలు పైరవీకారులతో నిండిపోయేవి. రైతుల మేలు కోసం తెచ్చిన ధరణిని వద్దని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులను ఆగం చేసేందుకే ధరణిని రద్దు చేస్తామని పదేపదే ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే రైతులు మునగడం ఖాయం.
– శివయాదవ్, చల్లంపల్లి, కడ్తాల్
ధరణి పోర్టల్ పోతే రైతులు మళ్లీ దగాపడుతరు. సీఎం కేసీఆర్ సార్ తెచ్చిన ధరణి పోర్టల్తో మా భూములకు ఓ భద్రత దొరికింది. బరాబర్ మా భూమి మా పాస్బుక్కులనే ఉంటుంది. రైతు బంధు పడుతుంది. కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తం అంటుండ్రు. ధరణి పోతే మళ్లా కష్టాలు షురూ అయితయి. భూమి పాస్బుక్ల ఉంటదో, ఎవరు తీసేస్తరో తెల్వని పరిస్థితి ఉంటది. మళ్లీ అధికారుల సుట్టూ, రెవెన్యూ ఆఫీస్ సుట్టూ తిరిగే పరిస్థితి దాపురిస్తది. ధరణి తీసి బంగాళాఖాతంలో కలుపుతామంటున్న కాంగ్రెసోళ్లకు తగిన బుద్ధి చెప్పాలె. ధరణితోనే రైతుకు రక్షణ అనే విషయం గుర్తెరగాలి.
– సుక్క భిక్షపతి, పెద్దఅంబర్పేట
కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ను రద్దు చేసి భూ రికార్డులు మాయం చేయాలని చూస్తున్నది. రైతుల జీవితాలను దళారుల చేతుల్లో పెట్టడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. బీఆర్ఎస్ ధరణి పోర్టల్ తీసుకురావడం ద్వారా దళారులకు డబ్బులిచ్చే పరిస్థితి రాలేదు. ధరణి రద్దయితే రైతులకు కష్టాలు తప్పవు రైతు బంధు ఆగిపోతుంది. కాంగ్రెస్ మాటలను నమ్మడానికి రైతులు ఎవరూ సిద్ధంగా లేరు. రైతులు బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. రైతులకు భూ సమస్యలు తీరాలంటే బీఆర్ఎస్ రావాలి.. సీఎం కేసీఆర్ కావాలి.
– నర్సింహ, రైతు, ఇంజాపూర్, తుర్కయాంజాల్
కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి తీసేసి పాత పద్ధతిలో పట్వారీ వ్యవస్థను తెస్తే మళ్లీ మాలాంటి రైతులు మోసపోతారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతుల భూరికార్డులు భద్రంగా ఉన్నాయి. ధరణి తీసుకురావడంతో రైతుకు తెలువకుండా అతడి భూమి మరొకరికి మార్చే అవకాశమే లేదు. ధరణి మార్చితే రైతులు నెలకోసారి మీ సేవకు పోయి మా పేరు మీదే భూమి ఉందా లేదా, వేరే పేరుకు ఎక్కిందా అని చూసుకోవల్సి వస్తుంది. కేసీఆర్ పుణ్యమా అని ధరణితో రికార్డుల్లో అవకతవకలు లేకుండా చేసిండు. బీఆర్ఎస్ను గెలిపిస్తేనే క్షేమంగా ఉంటాం.
– రమేశ్వర్రెడ్డి, చన్వల్లి, చేవెళ్ల
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి వ్యవస్థను రద్దు చేస్తే రైతులు గోసపడుతారు. కేసీఆర్ పాలనలో రైతులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు. ధరణి పోతే పటేల్ పట్వారీ వ్యవస్థ మళ్లీ రైతుల ప్రాణాలు తీస్తుంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు చిచ్చుపెడుతున్నారు. వేలిముద్ర పెడితే మన భూముల వివరాలు క్షణాల్లో మనముందుంటున్నాయి. రైతులు ఆలోచించి ఓటెయ్యాలి. రైతులు పచ్చగా ఉండే కేసీఆర్ పాలన కావాలా లేక రైతుల ప్రాణాలు తీసే కాంగ్రెస్ పాలన కావాలో ప్రజలే ఆలోచించుకోవాలి.
– వడ్డె భిక్షపతి, శంకర్పల్లి
కాంగ్రెస్ నాయకులు ధరణిని తీసేసి కౌలుదారు చట్టం తీసుకువస్తే మళ్లీ రైతులకు కష్టాలు తప్పవు. ధరణితో భూముల వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. గతంలో వివరాలు తెలుసుకోవాలన్నా కుదిరేది కాదు. సీఎం కేసీఆర్ రైతుల మేలుకోరి ధరణి పోర్టల్ సేవలు తీసుకొచ్చారు. భూ క్రయ, విక్రయాలు, ఒకరిమీద నుంచి మరొకరి పేరు మీదకు భూములు చేయడం తొందరగా అవుతున్నాయి. మునుపు ఇలా జరగాలంటే నెలలు గడిచేది. కాంగ్రెస్ వాళ్లకు ఏం తెలుసు రైతుల కష్టాలు. వారికి సరైన బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
– మల్లారెడ్డి, కౌకుంట్ల, చేవెళ్ల రూరల్
ధరణి పోర్టల్ను తీసేస్తే భూముల రిజిస్ట్రేషన్ కోసం పైరవీకారుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సివస్తుంది. పటేల్, పట్వారీలకు లంచాలివ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ధరణి తీసేసి బంగాళాఖాతంలో పడేయాలి అంటున్న కాంగ్రెస్ పెద్దల ఆ మాటల వెనుక మతలబు ఎందో ప్రజలకు వివరించాలి. సీఎం కేసీఆర్ రైతులు పడ్డ ఇబ్బందులను గమనించి అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ తీసుకురావడంతో పనులన్నీ సజావుగానే జరుగుతున్నాయి. కాంగ్రెసోళ్లు చెప్పే మాటలు వింటే అందరూ నట్టేట మునగాల్సిందే. మళ్లీ కేసీఆర్ రావాలి.. ధరణి పోర్టల్ ఉండాలి.
– మహ్మద్ అఫ్సర్, శ్రీనివాసకాలనీ, ఆమనగల్లు
గతంలో రైతులను నష్టాలపాలు చేసిన కాంగ్రెస్ పాలకులు.. ఇప్పుడు అమలు కాని హామీలు ఇస్తూ.. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ తీసేస్తామనడం సరైంది కాదు. ధరణి జోలికోస్తే రైతులెవ్వరూ ఊరుకోరు. ధరణితో రెవెన్యూ అధికారులకు తప్పు చేసే అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయ భూములకు సైతం విలువ పెరిగింది. కాంగ్రెసోళ్లు మళ్లీ అన్నదాతలను దళారీల ఉచ్చులోకి లాగుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ను రద్దుచేస్తామనటం సిగ్గుచేటు. ప్రజలంతా కాంగ్రెస్కు ఓటుద్వారా బుద్ధి చెప్పాలి.
– నిట్టు జగదీశ్వర్, ఇబ్రహీంపట్నం
ధరణి వల్లే రైతులు ధైర్యంగా ఉన్నరు. ధరణి ఖచ్చితంగా ఉండాల్సిందే. కేసీఆర్ తెచ్చిన ధరణితో భూములు భద్రంగా ఉన్నాయి. మాకు కావాల్సినపుడు పోయి ఆన్లైన్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ధరణి లేకపోతే ఎమ్మార్వో అఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ధరణి పోర్టల్ రద్దంటే కాంగ్రెస్ పార్టీ పని ఖతమే. ధరణి జోలికొస్తే ఎవరూ ఊరుకోరు. పాత పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తే భూముల మీద ఎవరికీ నమ్మకం ఉండదు. మళ్లీ రైతుల బతుకులు ఆగమే. అందుకే ఈ కాంగ్రెసోళ్ల మాటలు మేము నమ్మం. వారికి ఓటుతో బుద్ధి చెబుతాం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.
– జంతుక అల్లాజీ, జంగారెడ్డిపల్లి, ఆమనగల్లు
సీఎం కేసీఆర్ సార్ అమలు చేస్తున్న ధరణిని తొలగిస్తే ఊరుకునేదిలేదు. ధరణితోనే రైతుల భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. ధరణిని తొలగిస్తే మళ్లీ సమస్యలు మొదటికొస్తాయి. దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. రైతుల భూములపై ఎలాంటి అనుమానాలు లేకుండా ఉన్నాం. ధరణి తీసేస్తె వీఆర్వోలు వస్తారు. వాళ్లు వస్తే భూములు అటూ ఇటూ రాస్తారు. మళ్లీ మా భూములకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న అందోళన ఉంటుంది. ధరణిని రద్దు చేస్తే కాంగ్రెస్కు రైతులు బుద్ధి చెప్పడం ఖాయం. మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులు సుభిక్షంగా ఉంటారు.
– పోరెడ్డి రాంరెడ్డి, ఉప్పరిగూడ, ఇబ్రహీంపట్నం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే భూముల ధరలు పడిపోయే ప్రమాదముంది. కౌలుదారు కాలమ్ భయంతో స్వయంగా వ్యవసాయం చేయలేనివారు భూమిని బీడు పెడతారు తప్ప కౌలుకు ఇచ్చి రిస్క్ తీసుకోరు. ఫలితంగా సాగు పడిపోతుంది. ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విధానాన్ని చూసి ఓర్వలేక రాష్ర్టాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. హామీలు చూసి ఓటు వేయవద్దు.
– సత్యనారాయణ, శేరిగూడ, శంకర్పల్లి