ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 3 : నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిపై 40,127ఓట్లతో విజయం సాధించారు. మొదటి నుం చి ప్రతిరౌండ్లోనూ ఆయన ఆధిక్యత కనబర్చారు. పట్నం ఓట్ల లెక్కింపు ఆదివారం మంగల్పల్లి సమీపంలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చేపట్టారు. గత నెల 30న జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మొత్తం 3.27, 883ఓట్లు ఉన్నాయి.
ఇందులో 2,45,105మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్పార్టీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిని విజయం వరించింది. ఈ ఎన్నికల్లో ఆయనకు 1,24,447ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డికి 84,320 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్కు 15,064ఓట్లు, సీపీఎం అభ్యర్థి పగడాల యాదయ్యకు 8,710 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి గొరిగె మల్లేశ్కు 2,556ఓట్లు వచ్చాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్రెడ్డి రంగారెడ్డికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
ఆదివారం సీవీఆర్ కళాశాలలో జరిగిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి ఓట్ల లెక్కింపు పటిష్టమైన బందోబస్తు మధ్య అధికారులు చేపట్టారు. శనివారం రాత్రి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం జరిగిన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఓట్ల లెక్కింపు విషయంలో అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మూడంచెల భద్రత మధ్యన కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ ఏజెంట్లకు తప్పా..ఇతరులు ఎవ్వరినీ కౌంటింగ్ హాల్లోకి అనుమతించలేదు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను రాచకొండ కమిషనర్ డీహెచ్ చౌహాన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఎ
నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఘన విజయం సాధించటంతో ఆ పార్టీ నేతలు గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకొన్నారు. గ్రామాల్లో బాణసంచా కాల్చుతూ…బైకుర్యాలీ నిర్వహించారు. పలుచోట్ల స్వీట్లు పంచుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 38 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపుకోసం కార్యకర్తలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం అభ్యర్థి ఒక్కసారి గెలిచినప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు అంతగా సంతృప్తి చెందలేదు. 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఏజీ కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో సీపీఎం, తెలుగుదేశం, టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో పాటు బీజేపీ, సీపీఎం అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఆ పార్టీల అభ్యర్థులు తమ ఓటును తమవైపు తిప్పుకోవడంలో విఫలమయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీకి 16వేల ఓట్లు, సీపీఎంకు 9 వేల ఓట్లు వచ్చాయి. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీలు తమ ఓట్లను కాపాడుకోలేకపోయారు. ఆ ఓట్లు కాంగ్రెస్ గెలుపునకు దోహదపడ్డాయన్న చర్చ కూడా జరుగుతుంది.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మల్రెడ్డి రంగారెడ్డి పదిహేనేండ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2014లో కాంగ్రెస్ టికెట్కోసం ప్రయత్నించినప్పటికీ ఆయనను మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపారు. 2018లో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించగా.. టికెట్ రాకపోవటంతో 2018లో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2023లో విజయం ఆయన సొంతమైంది. ఇబ్రహీంపట్నం ప్రజలు ఆయన నిరీక్షణకు పట్టం కట్టారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : నియోజకవర్గంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కొనసాగించింది. నియోజకవర్గంలో మొత్తం 2473మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో కాంగ్రెస్కు 1867ఓట్లు రాగా, బీఆర్ఎస్కు 606ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లో కూడా బీఆర్ఎస్కు అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదు.
సైలెంట్ ఓటింగ్ కాంగ్రెస్పార్టీ గెలుపునకు దోహదపడింది. సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిపై ఆధారపడి బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అయిప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వీచిన సైలెంట్ ఓట్లలో భాగంగా ఇబ్రహీంపట్నంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్వైపు మొగ్గు చూపారు. హైదరాబాద్ విశ్వనగరం చుట్టూ బీఆర్ఎస్ గెలుపొందినప్పటికీ హైదరాబాద్ శివారులో విస్తరించి ఉన్న ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీ, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో కూడా ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి ఊహించని రీతిలో విజయం సాధించారు.
మహిళలు కూడా ఎక్కువగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. నియోజకవర్గంలో 1,61,786 మహిళా ఓటర్లున్నారు. ఇందులో 1,21,483 ఓట్లు పోలయ్యాయి. ఇందులో అత్యధికశాతం మహిళా ఓటర్లు కాంగ్రెస్వైపే మొగ్గు చూపినట్లు స్పస్టమవుతున్నది. ఫార్మాసిటీ పరిసర గ్రామాలైన మేడిపల్లి, తాడిపర్తి, నానక్నగర్, కుర్మిద్ద, నజ్దిక్సింగారం వంటి గ్రామాల్లో కూడా భూములు కోల్పోయిన రైతులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటింగ్లో పాల్గొనట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా మార్పు రావాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500లకు గ్యాస్ సిలిండర్ వంటి ఉచిత పథకాల ఓటర్లను బాగా ఆకట్టుకున్నాయి. గత ఎన్నికల మాదిరిగా రెండు పార్టీల మధ్య ఐదు వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీతోనే ఎవరైనా గెలుస్తారని అందరూ భావించారు.ఊహించని రీతిలో కాంగ్రెస్పార్టీ భారీ మెజార్టీ సాధించింది.
శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తనకు ఘన విజయాన్ని అందించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారెంటీలను మొదటగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినందున ప్రభుత్వంతో మాట్లాడి అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.
– మల్రెడ్డి రంగారెడ్డి