కొండాపూర్, మే 17 : కట్టుకున్న భార్యను, కన్న కొడుకును కాదని రహస్యంగా రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. నిలదీసిన మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బాధితురాలు భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… లింగంపల్లి రైల్ విహార్ కాలనీలో నివాసం ఉండే బండా రోహిత్ యాదవ్ తో మహాలక్ష్మికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.
వీరికి మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అయితే, కొంత కాలంగా భార్య, కొడుకుని సరిగ్గా పట్టించుకోకోపోవడమే కాకుండా వేధింపులకు గురి చేస్తుండడంతో అల్వాల్ బొల్లారంలోని తన పుట్టింట్లో ఉంటుంది. ఇటీవల తనకు తెలియకుండా రోహిత్ యాదవ్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు.
విషయం తెలిసి మహాలక్ష్మి భర్తను నిలదీసేందుకు ఇంటికి వెళ్లగా రోహిత్ యాదవ్ దాడికి పాల్పడ్డాడు.
తనను, తన కొడుకును వద్దంటూ వేధిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహాలక్ష్మి, తన కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందే న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది. తమకు జరిగిన అన్యాయంపై బాధితురాలు మహాలక్ష్మి చందానగర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.