ఇబ్రహీంపట్నం : తెలంగాణ ప్రజల గడపగడపకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన టీఆర్ఎస్ ప్రభలమైన శక్తిగా ఎదిగిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు సంక్షేమ పథకాలు నాయకుల జేబులు నింపేవని, ఇప్పుడు ప్రజల కడుపులు నింపుతున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎంతెంత ఎగిరిపడినా ప్రజలు వారిని గుర్తించడం లేదన్నారు. 87 మున్సిపల్ వార్డులకు, 79 గ్రామాలకు బలమైన కమిటీల ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యిందని, సమన్వయంతో పని చేసిన నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ నెల 20న మండల, మున్సిపల్ కమిటీలను ఎన్నుకుంటామని పూర్తి కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాలను నియమిస్తామని తెలిపారు.
సామాజిక సమీకరణాలు, పార్టీ, నాయకత్వం, విధేయత, ప్రజల పట్ల అంకితభావం కలిగిన వారిని పార్టీ పదవులకు ఎంపిక చేస్తామని వివరించారు. పూర్తి సమయమిచ్చి పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసే సీనియర్ నాయకులకు ప్రభుత్వం నామినేటెడ్ పదవులతో పాటు జిల్ల కమిటీల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, అంజిరెడ్డి, ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్ చైర్పర్సన్లు పాల్గొన్నారు.