మన్సూరాబాద్, డిసెంబర్ 26: బండ్లగూడ రాజీవ్ స్వగృహ సముదాయాల్లోని సహభావన టౌన్షిప్ నివాసితులకు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. బండ్లగూడ పరిధి రాజీవ్ స్వగృహ సముదాయాల్లోని సహభావన టౌన్షిప్లో సోమవారం రాజీవ్ స్వగృహ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనిల్కుమార్తో కలిసి పర్యటించి అక్కడి నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన కట్టడాల వలన డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని లీకేజీలు ఏర్పాడ్డాయని, స్లాబ్స్ లీకేజీలు, సెల్లార్ పరిశుభ్రత, టౌన్షిప్ వెనుక ఉన్న జీఎస్ఐ గోడ కూలడంతో తలెత్తుతున్న ఇబ్బందులు, ఏసీటీపీ ప్లాంటు నిర్మాణం ఆవశ్యకత, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు, ఓపెన్ జిమ్, అదనపు లైట్స్ తదితర సమస్యలను టౌన్షిప్ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్శర్మకు ఫోన్ చేసి సమస్యలను వివరించాడు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజీవ్ స్వగృహ సముదాయాల్లోని ప్రజా సమస్యల కోసం త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ కొత్తపేట డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వట్నాల విశ్వేశ్వర్ రావు, టౌన్షిప్ వాసులు రాధాకృష్ణ, రాజుగౌడ్, బాబు, వెంకటేశ్వర్లు, నవీన్ పాల్గొన్నారు.