మొయినాబాద్, నవంబర్ 22 : వికారాబాద్లోని గోల్ఫ్ కౌంటీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని.. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి 27 వరకు గోల్ఫ్ గేమ్స్ నిర్వహిస్తున్నామని డ్రీమ్ వాల్యూ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పృథ్వీరెడ్డి అన్నారు. ఈ నెల 27 వరకు వికారాబాద్లోని గోల్ఫ్ కౌంటీలో నిర్వహిస్తున్న గోల్ఫ్ గేమ్స్కు సంబంధించి మంగళవారం మండల పరిధిలోని బాకారం గ్రామంలో గల డ్రీమ్ వాల్యూ రిసార్ట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీటీఐతో కలిసి అంతర్జాతీయ స్థాయిలో గోల్ఫ్ గేమ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న గోల్ఫ్ టోర్నమెంట్లో దేశంలోని పలు ప్రాంతాల క్రీడాకారులతోపాటు అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. టోర్నమెంటులో విజేతలుగా నిలిచిన జట్టుకు రూ.కోటి బహుమతిని డ్రీమ్ వాల్యూ గ్రూప్ ద్వారా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 27వ తేదీతో టోర్నమెంటు పూర్తి అవుతుందని అదే రోజు రూ. కోటి రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతుందని చెప్పారు. దేశంలోని గోల్ఫ్ క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఇది చక్కటి అవకాశమని పేర్కొన్నారు.
హైదరాబాద్లో నాలుగు గల్ఫ్ కౌంటీలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు
పీజీటీఐ సీఈవో ఉత్తమ్సింగ్ ముండీ మాట్లాడుతూ.. డ్రీమ్స్ వాల్యూ గ్రూప్తో టోర్నమెంట్ నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. ఈ టోర్నమెంట్లో అజితేష్ సందు, యువరాజ్ సింగ్ సందు, మను గండాస్, వరుణ్ పారిక్, ఓంప్రకాష్ చౌహాన్ ఫమీమ్ఖాన్, క్షితిజ్ నవీద్ కౌల్ అగ్రశేణి భారతీయ నిపుణులు పోటీలో ఉన్నారు. శ్రీలంకకు చెందిన మిథున్ ఫెరేరా, ఎన్.తంగరాజా, ఆనురా రోహణ, ప్రభాకర్తోపాటు నేపాల్కు చెందిన సుక్ర బహదూర్ రాయ్, హైదరాబాద్కు చెందిన హైదర్ హుస్సేన్మహ్మద్ హజార్, హార్థిక్ ఎస్ చావ్డా పోటీలో ఉన్నారని తెలిపారు. సంకీర్త్ నిర్దహోలు, శ్రీధర్రెడ్డి టోర్నమెంట్కు నాయకత్వం వహిస్తారని చెప్పారు. హైదరాబాద్లో నాలుగు గల్ఫ్ కౌంటీలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఊటీలో కూడా గోల్ఫ్ కౌంటీని క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.