వికారాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : మాతాశిశు సంరక్షణలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణలో ఆయా జిల్లాలు చేపడుతున్న కార్యక్రమాలను బట్టి ర్యాంకులను కేటాయిస్తూ వస్తున్నది. ఏప్రిల్ నెలకు 79.94 స్కోర్తో జిల్లాకు మొదటి ర్యాంకు దక్కింది. గత ఐదు నెలలుగా వికారాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలుస్తుండడం గమనార్హం. మాతాశిశు సంరక్షణలో భాగంగా జిల్లాలో జరిగిన ప్రసవాలు, ప్రభుత్వాసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయిన ప్రసవాలు, వీటిలో సాధారణ ప్రసవాలు, సిజేరియన్ కేసులు, ఎనీమియా కేసులు, బర్త్ ప్లానింగ్, యాంటినాటల్ కేర్ రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొంటుంది. గత ఐదు నెలలుగా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరగడంతోపాటు సాధారణ ప్రసవాలే అధికంగా ఉండడం గమనార్హం. మహిళల్లో రక్తహీనతకు సంబంధించిన ఎనీమియా కేసుల్లోనూ జిల్లాలోనే తక్కువగా నమోదయ్యాయి. యాంటి నెటల్ కేర్ రిజిస్ట్రేషన్లోనూ జిల్లా ముందుంది. ఏఎన్సీ (ప్రసవానికి ముందు సంరక్షణ) రిజిస్ట్రేషన్లోనూ జిల్లా ముందుంది. 84 రోజులకే జిల్లాలో గర్భస్థ మహిళలకు సంబంధించిన ఏఎన్సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను జిల్లా వైద్యారోగ్య శాఖ సిబ్బంది పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో జిల్లా ప్రజానీకానికి సకాలంలో మెరుగైన వైద్యం అందడంతోపాటు ఇతర వైద్య సదుపాయాలు చాలా మెరుగయ్యాయి.
ప్రభుత్వాసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు
జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది. గతంలో సరైన మౌలిక వసతులు, సిబ్బంది లేకపోవడంతో ప్రసవాలకై ప్రభుత్వాసుపత్రులకు రావాలంటే భయపడేవారు.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాసుపత్రులకు అధిక ప్రాధాన్యతనివ్వడంతోపాటు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడంతో జిల్లాలో గత ఎనిమిదేండ్లలో జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లోనే 79 శాతం ప్రసవాలు జరుగుతుండడం గమనార్హం. ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 1009 ప్రసవాలు జరగగా, ప్రభుత్వాసుపత్రుల్లో 802 ప్రసవాలు జరిగాయి. వీటిలో కేవలం 297 సిజేరియన్ ప్రసవాలుకాగా, మిగతావి సాధారణ ప్రసవాలుండడం గమనార్హం. జిల్లాలో గత ఐదేండ్లలో ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య కూడా పెరిగింది. 2017-18లో 4670 సాధారణ ప్రసవాలు, 2018-19లో 4943, 2019-20లో 5492, 2020-21లో 5693, 2021-22లో 6017, 2022-23లో 6574 సాధారణ ప్రసవాలు జరిగాయి. తాండూరు జిల్లా ఆసుపత్రిలో నెలకు 500లకుపైగా, వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో నెలకు 200 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలన్నీ 80 శాతం సాధారణ ప్రసవాలే ఉండడం గమనార్హం. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలతో ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం కూడా పెరగడంతోపాటు ప్రసవాల సంఖ్య భారీగా పెరిగాయి.
ఎనీమియా కేసులు తక్కువ నమోదు
మహిళల్లో వచ్చే రక్తహీనత సమస్యలకు సంబంధించిన కెనీమియా కేసుల్లో రాష్ట్రంలోనే జిల్లాలో తక్కువ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 17,399 మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించగా, జిల్లాలో కేవలం 155 మంది మహిళల్లో మాత్రమే రక్తహీనత సమస్య ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ గుర్తించింది. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించి నెలనెలా ఐరన్, పోలిక్ యాసిడ్ మందులను ఇవ్వడంతో జిల్లాలో వీరి సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్తో ఎనీమియా సమస్య పూర్తిగా సమసిపోనుంది. మహిళల్లో రక్తహీనతను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం : డాక్టర్ పాల్వన్కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
రాష్ట్ర ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. దీనిలో భాగంగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్, కేసీఆర్ కిట్స్ పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. జిల్లాలో ప్రసవానికి ముందు సంరక్షణతోపాటు ప్రసవం తర్వాత సంరక్షణలోనూ వైద్యారోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య అధికమయ్యాయి, కేసీఆర్ కిట్ పథకంతోపాటు ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దాదాపు 80 శాతం ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నాయి.