సిటీ బ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. నగరంలోని ఎక్కడో ఒకచోట తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్తీ బాట పేరిట అధికారులు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నా నీటి కష్టాలను తీర్చలేకపోతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోప్రెషర్, సరఫరాలో అంతరాయం, నల్లాల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతుండటం జలమండలి పనితీరును ప్రతిబింబిస్తున్నది. పటిష్టమైన వ్యవస్థతో అధికార వ్యవస్థ, ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నా ప్రజలకు నీరందించడంలో జలమండలి విఫలమవుతున్నది. ఎండాకాలం వచ్చిందంటే నగర వ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి తలెత్తుతున్నది. ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ట్యాంకర్లు గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
మంజీర నుంచి వచ్చే నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తడం వల్ల డిమాండ్ పెరిగిన ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బుకింగ్లు వందలాదిగా పెండింగ్లో ఉంటున్నాయి. మంజీర పంపులు నిరంతరం పనిచేస్తున్నా తాగునీరు మాత్రం అంతే మొత్తంలో నగరంలోకి రావడం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఫిల్లింగ్ స్టేషన్లలో గంటల కొద్దీ అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించకపోవడం వల్ల ట్యాంకర్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల కమర్షియల్ ట్యాంకర్లు నిర్మాణంలో ఉన్న భవనాలకు అడ్డదారిలో వెళ్తున్నట్లు తెలుస్తున్నది. అధికారులు ఎక్కడా ఇబ్బందులు లేవని పైకి చెప్తున్నా క్షేత్రస్థాయిలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రత తగ్గేదాకా అప్రమత్తంగా ఉండి జలమండలి వినియోగదారులకు నీటి కష్టాలు లేకుండా చూడాలని కోరుతున్నారు.
నగర వ్యాప్తంగా ఫిర్యాదుల వెల్లువ..
రోజుల తరబడిగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని పలు కాలనీల ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. అధికారుల వైఫల్యంతో నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. కలుషిత నీరు, దుర్వాసనతో వస్తున్నదని ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు తలెత్తలేదని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే నగరంలో నీటి సమస్య తీవ్రమైందని మండిపడుతున్నారు. తాగునీరు నలుపు రంగులో ఉండి దుర్వాసన వెదజల్లుతున్నదని.. గోషామహల్ ప్రాంతంలోని ప్రజలు జలమండలి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల వద్దకు కలుషిత నీటిని బాటిళ్లలో నింపుకొని వచ్చి ఇలాంటి నీటిని మీరైతే వాడుతారా? అని నిలదీశారు. సుమారు వంద మందికి పైగా బాధితులు వచ్చి అధికారులకు తమ గోడును వెల్లబోసుకున్నారు.
బంజారాహిల్స్లోని నంది నగర్ పరిసర ప్రాంతాల్లో గత మూడు నెలలుగా నీటి సమస్య వేధిస్తున్నది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం రోడ్ నంబర్ 10లోని జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు నీటిని సరఫరా చేసేదాకా అక్కడి నుంచి కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఇలా నగర వ్యాప్తంగా నీటి సమస్య ప్రజలను వేధిస్తున్నది. ఉన్నతాధికారులు మాత్రం నగర వ్యాప్తంగా ఎక్కడా నీటి సమస్య లేదని ఊదరగొడుతున్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో నగర ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు.