శంకర్పల్లి, జూలై 15 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తున్నాయి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంటింటికీ తాగునీరు మొదలుకొని రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలు జాతీయ దృష్టిని ఆకర్షించాయి. ఎన్నో జాతీయ అవార్డులు రాష్ర్టాన్ని వరించాయి. ఇందులో ముఖ్యంగా మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లోని ప్రజలు ఏండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న నీటి సమస్య నుంచి ఉపశమనం పొందారు.
మిషన్ భగీరథ పథకానికి జల్జీవన్ మిషన్ పురస్కారం లభించింది. శంకర్పల్లి మున్సిపాలిటీ, మండలంలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన జలాలను అందిస్తూ ప్రజల గొంతును తడుపుతున్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గత ప్రభుత్వ పాలకుల హయాంలో ఎండాకాలం వస్తే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్ సంకల్పంతో మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికీ నీరు సరఫరా అవుతున్నది. మండలంలో 18వేలు, మున్సిపాలిటీలో 5500 కనెక్షన్లు ఉన్నాయి. మండల, మున్సిపాలిటీలో మిషన్ భగీరథ కోసం రూ.31కోట్లు ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.
సరిపడా నీళ్లు అందుతున్నాయి
శంకర్పల్లి మండలంలో గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా సరిపడా నీరు సరఫరా అవుతున్నది. గతంలో ప్రజలు వ్యవసాయ బోరు బావుల వద్ద నుంచి బిందెలతో నీటిని తెచ్చుకునేవారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు రావడంతో ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ప్రతిరోజూ లక్షల లీటర్ల తాగునీటిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్. ప్రజల నీటి కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ
తాగునీటి కష్టాలు తీరాయి
మిషన్ భగీరథ ద్వారా శంకర్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు తాగు నీటి కష్టాలు తీరాయి. గతంలో ట్యాంకర్లతో నీటిని ప్రజలకు సరఫరా చేసేవారు. గంటల తరబడి బోరింగ్ల వద్ద ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి ఇంటికీ భగీరథ ద్వారా నీళ్లు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు.
-విజయలక్ష్మీప్రవీణ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్