సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి జంట జలాశయాల్లో చేరుతున్నది. ఇన్ఫ్లోతో అప్రమత్తమైన జలమండలి అధికారులు శనివారం హిమాయత్సాగర్ ఆరు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న మూసీలోకి 4120 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శుక్రవారం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని వదిలిన అధికారులు..ఎగువ నుంచి 3500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో నీటి విడుదలను పెంచుతూ వస్తున్నారు. కాగా గండిపేట (ఉస్మాన్సాగర్)లోకి నామమాత్రంగా 300 క్యూసెక్కుల మేర మాత్రమే వరద నీరు వచ్చి చేరుతున్నది.
రిజర్వాయర్ గరిష్ఠ మట్టానికి మరో ఐదు అడుగుల మేర ఉండడంతో గేట్లను ఎత్తివేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నిం డుకుండలా మారిన జంట జలాశయాలు జలకళను సంతరించుకుని పర్యాటకంగా ఎంతో ఆకట్టుకున్నాయి. కాగా మూసీలోగా నీటి ప్రవాహం పెరుగుతుండడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, రెవె న్యూ విభాగాల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మూసీ నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొదని ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. రాబోయే మరో రెండు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన సందర్భంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికార యంత్రాంగంతోపాటు జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులను ప్రభుత్వం ఆదేశించారు.