వికారాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ఓటరు నమోదుకు అర్హులకు ఎన్నికల సం ఘం చివరి అవకాశాన్నిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు..కొత్త ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకునేందుకు నేటితో గడువు ముగి యనున్నది. 18 ఏండ్లు నిండిన వారు ఆన్లైన్(ceotel angana.in)తోపాటు మీసేవ ద్వారా కూడా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. పేరు, అడ్రస్ తదితర తప్పులుంటే ఆన్లైన్ లేదా తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకెళ్లి సరిదిద్దుకోవచ్చు.
అదేవిధంగా కొత్త ఓటరుగా నమోదు చేసుకున్న దరఖాస్తులతోపాటు మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్లికేషన్లను జిల్లా ఎన్నికల యంత్రాంగం రేపటి నుంచి పరిశీలించనున్నది. ఈనెల 25 లోగా వాటిని పూర్తి చేసి.. అనుబంధ ఓటరు జాబితాను విడుదల చేయనున్నది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 18న విడుదల కానున్నది. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమై ఈనెల 25 వరకు కొనసాగనున్నది.
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జిల్లాలో కొత్త ఓటర్లుగా అర్హుల నుంచి అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. జిల్లాలో కొత్తగా 20 వేల వరకు ఓటర్లు పెరిగే అవకాశమున్నది. దీనినిబట్టి జిల్లాలో ఓటర్ల సంఖ్య 10 లక్షలకు చేరనున్నది. అయితే ప్రస్తుతం జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్ తాండూరు నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 9,84,068 మంది ఉన్నారు. వారిలో పురుషులు 4,86,109 మంది కాగా మహిళలు 4,97,920 మంది, ఇతరులు 39 మంది ఉన్నారు.
అయితే జిల్లాలో అత్యధికంగా పరిగి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,66, 273 మంది ఉండగా.. వారిలో పురుషులు 1,33,625మంది, మహిళలు 1,32,639 మంది, ఇతరులు 9మంది ఉన్నారు. అలాగే వికారాబాద్ సెగ్మెంట్లో మొత్తం ఓటర్లు 2, 31,679 మందిలో పురుషులు 1,15,019 మంది, మహిళలు 1,16,647 మంది, ఇతరులు 13మంది ఉన్నారు. తాండూరు సెగ్మెంట్లో మొత్తం ఓటర్లు 2,43,849 మంది ఉండగా..పురుషులు 1,18,228 మంది, మహిళలు 1,25,614మంది, ఇతరులు ఏడు గురున్నారు. కొడంగల్ సెగ్మెంట్లో మొత్తం ఓటర్లు 2,42,267 మంది ఉండగా.. పురుషులు 1,19,237 మంది, మహిళలు 1,23,020 మంది, ఇతరులు 10 మంది ఉన్నారు.
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు అధికారులు సరిపడా ఈవీఎంలను తరలించారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు ప్రతి పోలింగ్ కేంద్రానికీ 25 శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, 40 శాతం అదనంగా వీవీప్యాట్లను సిద్ధం చేసి తరలించారు. పరిగి నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలుండగా, కంట్రోల్ యూని ట్లు, బ్యాలెట్ యూనిట్లు-381, వీవీప్యాట్లు-427లను తరలించారు.
అదేవిధంగా వికారాబాద్ సెగ్మెంట్లో 284 పోలింగ్ కేంద్రాలుండగా, 355-కంట్రోల్, బ్యాలెట్ యూని ట్లు, 397-వీవీప్యాట్లను, తాండూరు సెగ్మెంట్లో 277 పోలింగ్ కేంద్రాలుండగా, 346-బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, 397-వీవీప్యాట్లను .. కొడంగల్ సెగ్మెంట్లో 282 పోలింగ్ కేంద్రాలుండగా, పోలింగ్ కేంద్రాలకు అదనంగా 352-కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, 394-వీవీప్యాట్లను కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంకు తరలించి భద్రపర్చారు.