చేవెళ్ల రూరల్, నవంబర్ 25 : చేవెళ్ల మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లారెడ్డిగూడ గ్రామంలో క్షేత్ర దినోత్సవం (ఫీల్డ్ డే) ఏవో తులసి, సర్పంచ్ మల్గారి మోహన్రెడ్డి సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో తులసి మాట్లాడుతూ.. వానకాలం సీజన్లో క్షేత్ర ప్రదర్శనలైన పచ్చి రొట్ట ఎరువులు వాడకం, పీఎస్బీ వినియోగం, వరిలో వెదజల్లే పద్ధతి, ఎరువులు దఫాలుగా వినియోగించడంపై రైతులకు అవగాహన కల్పించడానికి ఫీల్డ్ డే ను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం జనుము వేసే పద్దతి, బీట్రూట్, క్యారెట్ పండించిన పొలాలు, పీఎస్బీ వినియోగించిన కంది పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఈవోలు స్వాతి, రమేశ్, వరుణ్, ఉప సర్పంచ్ పి.వెంకటేశ్, రైతులు రామిరెడ్డి, మల్లారెడ్డి, చల్మారెడ్డి, మహేశ్, గోపాల్ పాల్గొన్నారు.
కేశంపేట, నవంబర్ 25 : కేశంపేట మండలం కొత్తపేటలో శుక్రవారం వ్యవసాయాధికారి శిరీష ఆధ్వర్యంలో వరి సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. క్షేత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ రైతులు అంజిరెడ్డి, శేఖర్రెడ్డి పొలాల్లో ఆధునిక వ్యవసాయం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడుల సాధించే విధానాలను రైతులకు అధికారులు వివరించారు. ప్రస్తుతం వరి సాగులో పెరిగిన ఖర్చులను తగ్గించేందుకు వెదజల్లే పద్ధతిని రైతులు అవలంబించాలని ఏఈ శిరీష సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాము, వినయ్, లలిత సుస్మిత, సమీనా, సంయోద్దీన్, నిఖిల్, రైతులు పాల్గొన్నారు.