మోమిన్పేట / మర్పల్లి : మండలంలోని వరద ప్రమాదంలో మృతి చెందిన పలువురి బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ లు పరామర్శించారు. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు శంకర్ పల్లి మండలం కొత్తపల్లి వాగులో మృతి చెందిన శ్యామల వెంకటయ్య, మర్పల్లి మండల తిమ్మాపూర్ వాగులో మృతి చెందిన ప్రవళిక కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు రూ. 10వేల ఆర్థిక సహయం అందచేశారు. అదే విధంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు బొడ్డు లక్ష్మికాంత్ కుంటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుంటుంబానికి ధైర్యం చెప్పారు.
అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బాధిత వెంకటయ్య, ప్రవళిక కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారుతో వాగులో కొట్టుకుపోయి వ్యక్తులు గల్లంతై మృతి చెందడం బాధకరమన్నారు. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలను ఆదుకునేలా తమ వంతు సహాయం చేస్తామన్నారు. వీరి వెంట జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ , మండల టీఆర్ ఎస్ అధ్యక్షుడు నర్సింహ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.