వికారాబాద్, జూన్ 26, (నమస్తే తెలంగాణ) : పోలీస్ అధికారాలను ప్రజల శ్రేయస్సు కోసమే ఉపయోగించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని డీటీసీలో 2020 బ్యాచ్కు చెందిన వికారాబాద్ పీఎస్ఐలతో పోలీస్ వ్యవస్థపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ మాట్లాడుతూ.. అన్ని శాఖల కన్నా పోలీస్ శాఖ అతి కష్టమైనదని, అధికారాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పోలీస్ వ్యవస్థలో ఉత్సాహంతో విధులు నిర్వహించాలని, 24 గంటలు పనిచేసి మనల్ని మనం మలుచుకోవాలని తెలిపారు. ఎటువంటి చెడు వ్యసనాలకు, తప్పుడు మార్గాలకు లోను కాకుండా చూసుకోవాలన్నారు. సోషల్ మీడియా, ఇతర ఒత్తిళ్లను తట్టుకొని సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారికి ఉండాల్సింది క్రమశిక్షణ అన్నారు. మనకు 12 నెలల ట్రైనింగ్ ఇస్తారన్నారు. ట్రైనింగ్లో నేర్చుకున్న క్రమశిక్షణను మీ సర్వీస్ కాలం మొత్తానికి పాటించాలని సూచించారు.
పోలీస్ వ్యవస్థలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది పోలీస్ వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తూ, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. పై అధికారులను గౌరవిస్తూ, ఆదేశాలు, సూచనలను పాటించాలని తెలిపారు. ప్రజల శ్రేయస్సు మన విధి అని గుర్తుంచుకోవాలన్నారు. అరెస్టు చేసే సమయంలో పాటించాల్సిన విషయాలు, లాకప్ మరణాలు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.. వాటి లాభాలను, నేర పరిశోధనలో పాటించాల్సిన మెళకువలను వివరించారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అదనపు ఎస్పీ ఎంఏ రషీద్, వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.