పరిగి, సెప్టెంబర్ 19 : జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా పరిధిలోని నవాబుపేట్ మండలం అర్కతల గ్రామంలో సుమారు 349 ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. టీఎస్ఐఐసీ ద్వారా ఈ స్థలాన్ని పరిశ్రమల స్థాపనకు అనువుగా, ప్లాట్లుగా తయారు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం కేటాయించనున్నారు. ఇప్పటివరకు 276 ఎకరాల స్థలాన్ని టీఎస్ఐఐసీ వారికి అప్పగించడం జరిగింది. సర్వే నెంబర్ 32లో గల భూమిని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కేటాయించారు. ఇంకా 73 ఎకరాల భూమిని త్వరలోనే టీఎస్ఐఐసీ వారికి అప్పగించేందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా స్థలాన్ని చదును చేసి సరిహద్దుల్లో ఫెన్సింగ్ పిల్లర్స్ ఏర్పాటుకు టీఎస్ఐఐసీ పనులు ప్రారంభించింది. సోమవారం భూమి చదును చేసే పనులు, ముళ్లపొదల తొలగింపు పనులను అర్కతల సర్పంచ్ రాములు ప్రారంభించారు. ఈ పనులను టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ శ్రవణ్కుమార్, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
వేలాది మందికి ఉపాధి..
అర్కతలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. 349 ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో ప్లాట్లు చేసి డీటీసీపీ అమోదం అనంతరం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయించనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా నాణ్యమైన ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ అనంతరం మార్కెట్లో విక్రయించనున్నారు. తద్వారా చక్కటి, నాణ్యమైనవి లభించే అవకాశం కలుగుతుంది. పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని సర్కారు సంకల్పించింది. హైదరాబాద్ నగరానికి దగ్గరలోనే అర్కతల ఉండడంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు వాటిలో పనిచేసేందుకు వేలాది మందికి ఉపాధి లభించనుంది. అర్కతల చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.
లెవలింగ్ పనులు ప్రారంభం
నవాబుపేట మండల పరిధిలోని అర్కతలలోని ప్రభుత్వ భూమిలో ఏర్పాటుచేస్తున్న ఫుడ్ప్రాసెసింగ్ జోన్ నిర్మాణ లెవలింగ్ పనులను సోమవారం సర్పంచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాములు మాట్లాడుతూ దాదాపు 350 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఫుడ్ప్రాసెసింగ్ జోన్ నిర్మాణ పనుల కోసం భూమిని చదునుచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యాదయ్య, ఉప సర్పంచ్ సంగారెడ్డి, సెక్రటరీ, సర్వేయర్ ఉమా మహేశ్వర్, అధికారులు ఉన్నారు.