పరిగి, సెప్టెంబర్ 15 : ప్రజల ఆరోగ్య సంరక్షణపై సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా పరిగిలోని జడ్పీహెచ్ఎస్ నెం.1లో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్కారు దవాఖానలను బలోపేతం చేయడం ద్వారా పేదలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతున్నదని, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో అన్ని పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు. నులిపురుగుల నిర్మూలనకు విద్యార్థులు తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, తహసీల్దార్ నాగరాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, ఎంఈవో హరిశ్చందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంజిలయ్య, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నులిపురుగుల నివారణే ఉత్తమం
నులిపురుగుల నివారణే ఉత్తమమని ఎమ్మెల్యే ఆనంద్ చెప్పారు. స్థానిక కేజీబీవీ పాఠశాలలో ఆయన విద్యార్థులకు మాత్రలు వేశారు. అనంతరం పాఠశాలలోని వంట గది, వంట పాత్రలు, కూరగాయలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్వో శైలజ, సర్పంచ్ లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, ఎంపీడీవో బాలయ్య, ఎంపీటీసీ పద్మ పాల్గొన్నారు.
విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ
మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వైద్య సిబ్బంది అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. బొట్లవానితండా ఆశ్రమ పాఠశాల, చౌదర్పల్లి, బొంరాస్పేట ఉన్నత పాఠశాలలతోపాటు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు డిప్యూటీ డీఎంహెచ్వో ధరణికుమార్, జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ రవీంద్రయాదవ్, మండల వైద్యాధికారి అరుణ్కుమార్ విద్యార్థులకు టాబ్లెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, సీహెచ్వో శివరాజ్, వైద్యసిబ్బంది ఉన్నారు.
విద్యార్థులకు టాబ్లెట్లు పంపిణీ
వికారాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు, చిన్నారులకు ఉపాధ్యాయులు వైద్యుల సూచనల మేరకు మాత్రలు వేశారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు సగం టాబ్లెట్, 2 నుంచి 19 సంవత్సరాల వయస్సు గలవారికి ఒక టాబ్లెట్ను వేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గాయత్రి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమణమ్మ, నాగయ్య, ఏఎన్ఎం సంతోష, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
వ్యక్తిగత శుభ్రతను పాటించాలి
నవాబుపేట : మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లోని సిబ్బంది పాఠశాలల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను వేశారు. మండల ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ ప్రసాద్ నవాబుపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన నులిపురుగుల నివారణ దినం కార్యక్రమంలో ఎంపీపీ కాలె భవాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. వైద్యాధికారులు ఆరోగ్య నియమాలను సూచించినట్లుగా విద్యార్థులు పాటిస్తూ.. వ్యక్తిగత శుభ్రతను కూడా అలవాటు చేసుకోవాలన్నారు. అంతకుముందు మండల ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ.. పిల్లలు మట్టిలో ఆడి వెనువెంటనే చేతులు శుభ్రం చేసుకోకుండా ఆహార పదార్థాలను తీసుకోవడం.. పొద్దున లేచి కాలకృత్యాలు చేసిన తర్వాత పరిశుభ్రత పద్ధతులను పాటించకపోడంతో చాలా రోగాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం పాండు, ఎంఈవో గోపాల్, పాఠశాల సిబ్బంది, వైద్యసిబ్బంది ఉన్నారు.
నులిపురుగుల నివారణ టాబ్లెట్లు వేయించాలి
మర్పల్లి : పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా వేయించాలని పట్లూర్ పీహెచ్సీ డాక్టర్ అంబిక అన్నారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో పిల్లలకు నులిపురుగుల నివారణ టాబ్లెట్లు వేశారు. ప్రభుత్వం ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు.
10,336 మందికి మాత్రల పంపిణీ
కొడంగల్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలను మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డా.రవీంద్రయాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల పరిధిలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నవారు 11,485 మంది ఉండగా గురువారం 10,336 మందికి టాబ్లెట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగతావారికి 22న పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు హరిప్రసాద్, మహేందర్, వైద్య సిబ్బంది విజయరాణి, మధుసూదన్రెడ్డి, చంద్రకళ, కళాశాల అధ్యాపక బృందం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
1-19 సంవత్సరాల పిల్లలకు మందు బిళ్లలు వేయాలి
కులకచర్ల : నులిపురుగుల నివారణకు 1-19 సంవత్సరాలున్న పిల్లలకు అల్బెండజోల్ టాబ్లెట్లు వేయించాలని ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్ అన్నారు. కులకచర్ల మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్వో చంద్రప్రకాశ్ మాట్లాడుతూ.. 96 పాఠశాలల్లో 10,172 మంది పిల్లలకు 9,136 మందికి మందులు వేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
మోమిన్పేట : మండల పరిధిలోని ఎన్కతల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల మాత్రలపే ఏఎన్ఎం మంజుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, పాఠశాల సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
నులిపురుగుల నివారణతో శారీరక పెరుగుదల
పెద్దేముల్ : విద్యార్థులు, చిన్నారుల్లో శారీరక పెరుగుదల ఉండాలంటే ప్రతిఒక్కరికీ తప్పకుండా నులి పురుగుల నివారణ మాత్రలను విధిగా వేయించాలని మంబాపూర్ సర్పంచ్ శ్రావణ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని మంబాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఏఎన్ఎం కవిత ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్బెండజోల్ టాబ్లెట్లు వేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరప్ప, టీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, నాయకుడు సాయిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.